
పాసుల కోసం కమిషనరేట్కు రావొద్దు: సీపీ
హైదరాబాద్: లాక్డౌన్ పొడిగింపుపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించామని.. మరింత కట్టుదిట్టంగా దాన్ని అమలు చేస్తామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్(సీపీ) అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆంక్షలు ఉన్నాయని.. వాటిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడారు. నగరంలో 12వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారని.. సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వహించే వారికి పీపీఈ కిట్లు అందజేశామన్నారు.
అత్యవసరమైతే పాసులు ఇస్తున్నామని.. దానికోసం వెబ్పోర్టల్ ప్రారంభించామని అంజనీకుమార్ వివరించారు. పాస్ల కోసం ఎవరూ కమిషనర్ కార్యాలయానికి రావొద్దని.. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అన్ని మతాలవారు తమ పండుగలను ఇళ్లలోనే జరుపుకోవాలన్నారు. దాతలు, జీహెచ్ఎంసీ సహకారంతో పేదలకు సరకులు పంపిణీ చేస్తున్నాని సీపీ చెప్పారు. అత్యవసర సేవల కోసం ఇచ్చిన పాసులను దుర్వినియోగం చేస్తే వాటిని రద్దు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్లో ఇప్పటివరకు 124 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని సీపీ తెలిపారు.
Advertisement