విద్యార్థుల కోసం చెట్టెక్కిన మాస్టారు

విద్యార్థులకు పాఠాలు చెప్పే క్రమంలో ఓ మాస్టారు ప్రతిరోజూ చెట్టెక్కుతున్నాడు. వేప చెట్టెక్కి విద్యార్థులకు నాగరికత, రాజ్యాలు, రాజులు, వారు చేసిన యుద్ధాలపై ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ! పశ్చిమ.....

Published : 21 Apr 2020 01:11 IST

సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ లేక కష్టాలు

కోల్‌కతా: విద్యార్థులకు పాఠాలు చెప్పే క్రమంలో ఓ మాస్టారు ప్రతిరోజూ చెట్టెక్కుతున్నాడు. వేప చెట్టెక్కి విద్యార్థులకు నాగరికత, రాజ్యాలు, రాజులు, వారు చేసిన యుద్ధాలపై ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ! పశ్చిమ బెంగాల్‌లోని బాంకురా జిల్లా అహందా గ్రామానికి చెందిన సుబ్రతాపాటి కోల్‌కతాలోని రెండు విద్యాసంస్థల్లో చరిత్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా తన సొంతూరికి వెళ్లిపోయారు.

ఊరెళ్లాక అసలు కష్టాలు మొదలయ్యాయి ఆయనకు. అక్కడ నెట్‌వర్క్‌ తక్కువగా ఉండటంతో అతడి సెల్‌ఫోన్‌కు సిగ్నల్‌ అంతంతమాత్రమే వచ్చేది. ఫలితంగా ఇంటర్నెట్‌ పనిచేయలేదు. కానీ అతడు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు తరగతులు బోధించడం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అతడి మెదడులో ఓ ఆలోచన తట్టింది. తన ఇంటి సమీపంలోని ఓ వేప చెట్టెక్కి సిగ్నల్‌ కోసం ప్రయత్నించగా అది ఫలించింది. దీంతో ఆ చెట్టుపైనే కర్రలతో చిన్నపాటి నివాసం ఏర్పరచుకొని అక్కడి నుంచే విద్యార్థులకు పాఠాలు బోధించడం మొదలుపెట్టాడు. 

ఉదయాన్నే భోజనం, నీరు తీసుకొని చెట్టెక్కుతానని, ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో రెండు నుంచి మూడు తరగతులు బోధిస్తానని చెప్పుకొచ్చాడు సుబ్రతాపాటి. చెట్టుపై ఎలాంటి అంతరాయం లేకుండా సిగ్నల్‌ వస్తోందని తెలిపారు. ఎండ తీవ్రత ఇబ్బంది పెడుతున్నా తట్టుకుంటున్నానని చెప్పాడు. తనవల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదంటున్నాడు ఈ 35 ఏళ్ల చరిత్ర ఉపాధ్యాయుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని