
రూ.100 కోట్ల సాయానికి ముందుకు
దేశవ్యాప్తంగా కార్యక్రమాలు: కోకాకోలా
న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు దాతలు, వివిధ సంస్థలు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ శీతల పానీయాల ఉత్పత్తి సంస్థ కోకాకోలా రూ.100 కోట్ల సాయం ప్రకటించింది. కరోనాపై పోరులో భాగంగా ప్రజల అవసరాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో 10 లక్షలకు పైగా భారతీయులకు ఉపశమనం కలుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా 50 ప్రాంతాల్లో ప్రజలకు సంస్థ ఉత్పత్తులను పంపిణీ చేయనుంది. దీంతోపాటు కోకాకోలా ఫౌండేషన్ సహకారంతో యునైటెడ్ వే, కేర్ ఇండియా సంస్థల భాగస్వామ్యంతో వైద్య, ఆహార భద్రతా రంగాల బలోపేత కార్యక్రమాల నిర్వహణకు ఊతం అందించనున్నట్లు పేర్కొంది. ఈ సంస్థ ఇప్పటికే వారణాసి ఇతర ప్రాంతాల్లో అక్షయపాత్ర ఫౌండేషన్ తదితర సంస్థలతో కలిసి పనిచేస్తూ.. పేదల ఆకలి తీర్చుతోంది. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందజేస్తోంది.