వైరస్‌ను పసిగట్టేస్తాయ్‌

దొంగలు, దోషుల్నే కాదు... పేలుడు పదార్థాల జాడనూ వాసనతో గుర్తించే శునకాలు మనుషుల్లోని కరోనా వైరస్‌ను పట్టేయలేవా?.. అని శాస్త్రవేత్తల బుర్రల్లో ఆలోచన

Updated : 05 May 2020 07:02 IST

దొంగలు, దోషుల్నే కాదు... పేలుడు పదార్థాల జాడనూ వాసనతో గుర్తించే శునకాలు మనుషుల్లోని కరోనా వైరస్‌ను పట్టేయలేవా?.. అని శాస్త్రవేత్తల బుర్రల్లో ఆలోచన తళుక్కుమంది. ఇంకేముంది ఆచరణకు రంగం సిద్ధమైపోయింది. శక్తిమంతమైన వాసన పసిగట్టే గుణం కలిగిన శునక రాజాల్ని ఎంపిక చేసేసి... చకచకా వాటికి తర్ఫీదును ఇవ్వడమూ మొదలైపోయింది. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వెటర్నరీ మెడిసిన్‌ విభాగం పరిశోధకులు ఈ విశేష కృషి చేస్తున్నారు. శునకాలు వాసన చూడటం ద్వారా క్యాన్సర్‌ను గుర్తించిన దాఖలాలు 1980ల్లోనే ఉన్నాయి. చాలా కణాలు త్వరగా ఆవిరి అయ్యే సేంద్రియ సమ్మేళనాలు(వీవోసీ)లను కలిగి ఉంటాయి. ఈ విలక్షణ తత్వం మనుషుల రక్తం, లాలాజలం, మూత్రంలోని కణాలకూ సొంతం. వాటి నుంచి వచ్చే వాసనల్ని పసిగట్టడం ద్వారా వైరస్‌ను గుర్తించే శక్తి శునకాలకు ఉందని పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకులు నొక్కిచెబుతున్నారు. కరోనాను కనుగొనేందుకు ప్రస్తుతం నెగెటివ్‌, పాజిటివ్‌ నమూనాలను శునకాల చెంత ఉంచుతూ వాసన చూపుతూ శిక్షణ ఇస్తున్నారు. మనుషుల్లో 60 లక్షల వాసన గ్రాహకాలు ఉంటే... అదే శునకాల్లో వాటి సంఖ్య 30 కోట్లు. అందుకే శునకాలకు ఏదైనా సాధ్యమవుతుందని పరిశోధకుల మాట. అవి తర్ఫీదును పూర్తి చేసుకుని జులైకల్లా రంగంలోకి దిగుతాయని భావిస్తున్నారు.

 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని