కరోనా వేళ ధూమపానం వద్దు.. ఆరోగ్యమే ముద్దు!

దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తుల్ని నమలడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే........

Published : 06 May 2020 20:06 IST

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ప్రజారోగ్య నిపుణులు 

ధూమపానం మానేందుకు టొబాకో క్విట్‌లైన్‌ సేవలు

హైదరాబాద్‌: దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తుల్ని నమలడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రజారోగ్య నిపుణులు స్వాగతిస్తున్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రం సకాలంలో ఈ నిర్ణయం తీసుకుందని వాలంటరీ హెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ భావనా ముఖోధ్యాయ్‌ అన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ ధూమపానం చాలా ప్రమాదకరమనీ,  దీనివల్ల ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో పాటు రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని హెచ్చరించారు. కరోనా బారినపడకపోయినప్పటికీ ధూమపానం అలవాటు మానుకొనేందుకు ఇదో మంచి సమయమని ఆమె తెలిపారు. 

అలవాటు మానేస్తే రోగనిరోధక శక్తి మెరుగు
ధూమపానం అలవాటు మానుకుంటే కొన్ని నెలల్లోనే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ మనోరోగ చికిత్స విభాగం ప్రొఫెసర్‌ ప్రతిమా మూర్తి అన్నారు. కరోనా నుంచి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు ఊపిరితిత్తులు, గుండె, శరీరంలోని ఇతర అవయవాలకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుందని చెప్పారు.   

టొబాకో క్విట్‌లైన్‌ సేవలు

ధూమపానం అలవాటు ఉన్నవారికి, పొగాకు ఉత్పత్తులు వాడే వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు  నేషనల్‌ టొబాకో క్విట్‌ లైన్‌ సర్వీసులను కేంద్ర  ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ అలవాటుకు పూర్తిగా బానిసలుగా మారిన వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, నిష్క్రమించే తేదీని నిర్ణయించడం, నిష్క్రమణ ప్రణాళికను రూపొందించడం వంటి చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం  టోల్ ఫ్రీ నంబర్ 1800-11-2356ను ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల మధ్య సేవలందించనున్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని