తాడేపల్లిలో కరోనా కలకలం

తాడేపల్లిలో కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. నాలుగు రోజుల కిందట రెండు కేసులు నమోదు కాగా శనివారం మరో రెండు కొత్త కేసులు...

Updated : 10 May 2020 08:53 IST

ఈనాడు-గుంటూరు: తాడేపల్లిలో కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. నాలుగు రోజుల కిందట రెండు కేసులు నమోదు కాగా శనివారం మరో రెండు కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇంతకు ముందు స్థానికంగా మూడు కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఏడు కేసులు ఇక్కడ రావటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. వీరిలో ఒకరు కరోనాతో చనిపోయినట్లు గతంలోనే ప్రకటించారు. శనివారం నమోదైన రెండు కేసులు ప్రకాష్‌నగర్‌లో వచ్చాయి. ఈ రెండు కేసులకు మూలాలు విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. ప్రకాష్‌నగర్‌లో ఇటీవల ఓ వ్యక్తి చనిపోయాడు. అతనికి స్వాబ్‌ తీయగా కరోనాగా నిర్దారణ అయింది. వెంనే విజయవాడ, తాడేపల్లిలో ఉంటున్న ఆయన కుటుంబీకులు 43 మందిని గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిలో కొన్ని ఫలితాలు శనివారం వచ్చాయి. అందులో చనిపోయిన వ్యక్తి భార్య, ఆయన కుమారుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు చెప్పారు.  చనిపోయిన వ్యక్తి విజయవాడ మాచవరంలో ఉంటూ అనారోగ్యానికి గురి కాగా అతన్ని తొలుత విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇది కొవిడ్‌ ఆస్పత్రి కావడంతో గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆ వ్యక్తి తాడేపల్లిలోని రెండో కుమారుడి వద్దకు వెళ్లి అక్కడి నుంచి జీజీహెచ్‌కు వచ్చారని, చికిత్స పొందుతూ చనిపోయారని అధికారులు చెప్పారు. అంత్యక్రియల కోసం విజయవాడ నుంచి బంధువులు తాడేపల్లి రాకపోకలు సాగించారని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని