
కేసీఆర్ ధరిస్తున్న కండువాలకు భలే డిమాండ్
సిరిసిల్ల: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల తెల్ల కండువా మెడలో వేసుకొని అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. సీఎం వేసుకుంటున్న కండువాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆయన మెడలో వేసుకుంటున్నవి సిరిసిల్ల సెల్లాలు. పల్లెల్లో ఇప్పటికీ పెద్దవారు సెల్లాలను ధరిస్తుంటారు. దుమ్మూధూళి సహా ఎండ నుంచి రక్షణ కోసం వీటిని వాడుతుంటారు. కరోనా వైరస్ వల్ల ఇప్పుడు ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరైంది. మాస్కులకు బదులుగా కొందరు దస్తీలు, తువ్వాలను కట్టుకుంటున్నారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ సెల్లాలను ధరించడం అంతటా చర్చనీయాంశమైంది. చేనేత కార్మికులను బాసటగా నిలవడం సహా కండువాల ప్రాధాన్యతను తెలియజేయడం కోసం కేసీఆర్ ఇలా సెల్లాలను ధరిస్తున్నారని తెలుస్తోంది.
సిరిసిల్ల అనంతనగర్కు చెందిన చేనేత కళాకారులు కోటేశ్వర్, శ్రావణ్ వద్ద తయారైన కండువాలను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. ఇప్పటి వరకు 3వేల సెల్లాలను వారు సీఎం కార్యాలయానికి అందజేశారు. తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తూ నెలకు రూ. 30లక్షల టర్నోవర్ సాధిస్తున్నారు. మరమగ్గాలపై పూర్తిగా కాటన్తో నేస్తున్న వస్త్రాల కోసం మంచి ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో లాక్డౌన్తో మూతపడిన వస్త్రపరిశ్రమకు కాస్త ఊరట లభించినట్లైంది. పూర్తి కథనం ఈ వీడియోలో చూడండి..