కరోనా మృతదేహం బ్యాగ్‌ తెరవడంతో..

కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలిసిందే. దేశంలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నా ప్రజల్లో మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. అందుకు ఉదాహరణే తాజాగా ముంబయిలో...

Published : 30 May 2020 11:15 IST

18 మంది బంధువులకు కొవిడ్‌ నిర్ధారణ

ముంబయి: కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలిసిందే. దేశంలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నా పలువురు మాత్రం ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. అందుకు ఉదాహరణే తాజాగా మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకున్న ఈ ఘటన. 40 ఏళ్ల ఓ మహిళ ఇటీవల కరోనా వైరస్‌ లక్షణాలతో మృతిచెందింది. వైద్యులు ఆమె మృతదేహాన్ని ప్యాక్‌చేసి బంధువులకు అప్పగించారు. దాన్ని తెరవకుండా నేరుగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించినా వారు పెడచెవిన పెట్టారు. అంతిమ సంస్కారాల్లో ఆమె మృతదేహం ప్యాక్‌ చేసిన బ్యాగ్‌ను తెరవడంతో బంధువుల్లో 18 మందికి వైరస్‌ సోకింది.

థానే జిల్లాలోని ఉల్లాస్‌ ‌నగర్‌లో మే 25న ఓ మహిళ(40) కరోనా లక్షణాలతో మృతిచెందింది. వైద్యులు ఆమె మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించి తర్వాత ప్యాక్‌చేసి బంధువులకు అప్పగించారు. దాన్ని తెరవకుండా నేరుగా అంత్యక్రియలు పూర్తి చేయాలని ఆదేశించారు. అయినా ఆమె బంధువులు అంతిమ సంస్కారాల కోసం ప్యాక్‌చేసిన బ్యాగ్‌ తెరిచి మృతదేహాన్ని తాకి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది హాజరయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఫలితాల్లో మృతురాలికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొన్న 50 మందిని తొలుత క్వారంటైన్‌ చేయగా.. అందులో 18 మందికి శుక్రవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పుడు మిగతావారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఈ ఘటనపై స్పందించిన ఉల్లాస్‌నగర్‌‌ మున్సిపల్‌ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. సంబంధిత బంధువులపై పోలీస్‌ కేసు నమోదు చేస్తామని చెప్పారు. అంత్యక్రియలకు సంబంధించిన నిబంధనలను వారు ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని