8లక్షల మాస్కులు సిద్ధం చేశాం: మంత్రి సురేశ్‌ 

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జులై 10 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. విజయవాడ పటమట సమగ్ర శిక్షా అభియాన్‌ కార్యాలయంలో పదో తరగతి పరీక్షల

Updated : 02 Jun 2020 19:12 IST

‘పది’ పరీక్షల నిర్వహణపై మంత్రి సమీక్ష

విజయవాడ: కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జులై 10 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. విజయవాడ పటమట సమగ్ర శిక్షా అభియాన్‌ కార్యాలయంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలను 8 లక్షల మంది విద్యార్థులు రాయనున్నట్లు మంత్రి చెప్పారు. వారికోసం 4,154 పరీక్షా కేంద్రాలు గుర్తించామని, ప్రతి గదిలో కేవలం 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించడంతోపాటు.. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల కోసం 8లక్షల మాస్కులు అందుబాటులో ఉంచినట్లు మంత్రి చెప్పారు.

ప్రతి పరీక్షా కేంద్రం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో ఎలాంటి పరీక్షా కేంద్రాలు ఉండబోవని స్పష్టం చేశారు. ఒకవేళ గుర్తించిన పరీక్షా కేంద్రాల సమీపంలో కరోనా కేసులు నమోదైతే వాటి స్థానంలో వేరే కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. రెసిడెన్షియల్‌ విద్యార్థులకు ఒక రోజు ముందు నుంచే హాస్టల్‌ వసతి కల్పించనున్నట్లు వివరించారు. పరీక్షలు జరిగినన్ని రోజులు వారు వసతి గృహాల్లోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సాధ్యమైనంత వరకు ఎక్కడి వారు అక్కడే పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సురేశ్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని