ఆసుపత్రుల కాఠిన్యం..అంబులెన్సులోనే మరణం

మరో నెల గడిస్తే ఆ ఇంట్లో చిన్నారి కేరింతలు వినపడేవి. వారి అన్యోన్యతకు ఒక ప్రతిరూపం కళ్ల ముందు ఉండేది. ఇంతలో ఆమె కడుపులోని బిడ్డ కాస్త కలవరపెట్టాడు. వెంటనే ఆమె భర్త ఆసుపత్రి

Updated : 06 Jun 2020 20:12 IST

నోయిడా: మరో నెల గడిస్తే ఆ ఇంట్లో చిన్నారి కేరింతలు వినపడేవి. వారి అన్యోన్యతకు ఒక ప్రతిరూపం కళ్ల ముందు ఉండేది. ఇంతలో ఆమె కడుపులోని బిడ్డ కాస్త కలవరపెట్టాడు. వెంటనే ఆమె భర్త ఆసుపత్రి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. తీరా చూస్తే ఆసుపత్రుల యాజమాన్యాలు ఆ గర్భిణి చేరికను నిరాకరించాయి. ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఎనిమిది ఆసుపత్రులు. 13 గంటల నరకయాతన, ఫలితం అంబులెన్సులోనే ఆమె మరణం. ఉత్తరప్రదేశ్‌..నోయిడా పరిధిలో చోటు చేసుకున్న ఈ హృదయవిదారకరఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

గౌతమ్‌బుద్దనగర్‌ జిల్లాలోని కోడా కాలనీలో నివాసముంటున్న వీజేందర్‌సింగ్‌, నలీమ్‌ భార్యభర్తలు. ఎనిమిదో నెల గర్భిణిగా ఉన్న నలీమ్‌(30)కు అనుకోకుండా పురిటినొప్పులు మొదలవడంతో భర్త వీజేందర్‌సింగ్‌ అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మొదట ఒక ఆసుపత్రికి వెళ్లగా వారు సరిపడా బెడ్స్‌ లేవని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అలా మొత్తం 13 గంటల్లో ఎనిమిది ఆసుపత్రులు తిరిగాడు. చివరికి నలీమ్‌ నొప్పులు తాళలేక ఆంబులెన్సులోనే మరణించింది. 

దీనిపై వీజేందర్‌సింగ్ మాట్లాడుతూ..‘‘మొదట మేము ఈఎస్‌ఐ ఆసుపత్రికి వెళ్లాము. వారు నిరాకరించడంతో సెక్టార్ 30లోని చైల్డ్‌ పీజీఐ ఆసుపత్రికి, అక్కడి నుంచి షర్దా, జిమ్స్‌(గవర్నమెంట్ ఇన్‌సిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌)లకు వెళ్లాము. వాళ్లంతా నా భార్యను చేర్చుకునేందుకు నిరాకరించారు. ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రులైన జేయ్‌పీ, ఫోర్టీస్‌, మాక్స్‌ ఇన్‌ వైశాలిను ఆశ్రయించగా.. వారూ నిరాకరించారు. ఇలా 13 గంటలు అంబులెన్సులో తిరిగాక చివరకు జిమ్స్‌లోనే ఆమెను చేర్పించాను. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది’’ అంటూ గుండెలవిసేలా ఏడ్చాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాలలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఘటనపై స్పందించిన జిల్లా పాలనాధికారి సుహాస్‌ ఎల్‌వై దీనిపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో ముఖ్య వైద్యాధికారి అయిన మునీంద్ర నేతృత్వంలో ఘటనకు కారణమైన ఆసుపత్రులపై విచారణ చేస్తున్నారు.  ఈ ప్రాంతంలో ఇలా జరగడం ఇది రెండోసారి, గతంలో మే 25 ఇలాంటి ఘటనే చోటు చేసుకుని ఒక పసికందు మరణించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని