‘లోనార్‌’ రంగు మారడానికి కారణం అదేనా?

మహారాష్ట్రలో 50వేల ఏళ్ల ప్రాచీన చరిత్ర కలిగిన లోనార్‌ సరస్సు తాజాగా రంగు మారిన విషయం తెలిసిందే. ఇది స్థానికులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను, ప్రకృతి ఔత్సాహికులను కూడా ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై పరిశోధనలు కూడా ముమ్మరమయ్యాయి. ఇప్పటికే సరస్సునుంచి నీటి నమూనాలను సేకరించిన అధికారులు, పరిశోధనల కోసం పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. అయితే, తాజాగా నాసా శాస్త్రవేత్త డాక్టర్‌ షాన్‌ రైట్‌ కూడా లోనార్‌ సరస్సు రంగు మారడానికి గల కారణాలను నివేదించారు.

Published : 17 Jun 2020 01:16 IST

నాసా నిపుణుల నివేదికను విశ్లేషిస్తున్న అధికారులు

నాగ్‌పూర్‌: మహారాష్ట్రలో 50వేల ఏళ్ల  చరిత్ర కలిగిన లోనార్‌ సరస్సు తాజాగా రంగు మారిన విషయం తెలిసిందే. ఇది స్థానికులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను, ప్రకృతి ఔత్సాహికులను కూడా ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై పరిశోధనలు కూడా ముమ్మరమయ్యాయి. ఇప్పటికే సరస్సునుంచి నీటి నమూనాలను సేకరించిన అధికారులు, పరిశోధనల కోసం పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. అయితే, తాజాగా నాసా శాస్త్రవేత్త డాక్టర్‌ షాన్‌ రైట్‌ కూడా లోనార్‌ సరస్సు రంగు మారడానికి గల కారణాలను నివేదించారు.

షాన్‌ రైట్‌ తెలిపిన ప్రకారం ‘లోనార్‌ బిలం ఉపరితలంపై ఉన్న రాతిపునాదిపై గాజు వంటి నిర్మాణం ఉంది. ఇలాంటి బసాల్ట్‌ (అగ్నిపర్వతపు నల్లరాయి)రాయి ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఇవి కేవలం చంద్రునిపై ఉన్న బిలాలపై మాత్రమే కనిపిస్తాయి’ అని షాన్‌ రైట్‌ తన నివేదికలో వెల్లడించారు. దీని కారణంగానే లోనార్‌ సరస్సు రంగు మారే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.

అయితే, సరస్సు రంగుమారండం పర్యావరణంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయంపై బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరుపుతున్న బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌, దీనిపై జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(నీరి), భారత భూభౌగోళిక సర్వే నుంచి నివేదిక కోరింది. ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి నాలుగు వారాల్లోగా పూర్తి నివేదికను కోర్టుకు అందించాలని పేర్కొంది. అంతేకాకుండా, విచారణలో భాగంగా ప్రత్యేకంగా నియమించిన కమిటీతోపాటు విచారణ జరుపుతున్న న్యాయమూర్తులు కూడా స్వయంగా వెళ్లి సరస్సును పరిశీలిస్తామని కోర్టు  తెలిపింది.

ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో బుల్దానా జిల్లాలో ఉన్న ఈ సరస్సు దాదాపు 1.2 కి.మీ వ్యాసార్థంతో ఆ ఉంది. ముంబయి నుంచి దాదాపు 500కి.మీ దూరంలో  ఉన్న ఈ సరస్సు, దాదాపు 50వేల సంవత్సరాల క్రితం ఉల్కాపాతం వల్ల బిలంగా ఏర్పడిందని ఇప్పటికే గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోన్న ప్రాచీన లోనార్‌ సరస్సు రంగు కొన్నిరోజుల క్రితం ఒక్కసారిగా మారిపోయింది. సాధారణంగా పచ్చని రంగులో ఉండే ఈ సరస్సు గులాబీ రంగులోకి మారడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని