ఈ ఏడాది హజ్‌ యాత్ర ఉండదు: నఖ్వీ

ప్రపంచదేశాలతో పాటు భారత్‌నూ కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్‌ యాత్ర ఈ ఏడాది భారత్‌

Published : 23 Jun 2020 14:14 IST

న్యూదిల్లీ: ప్రపంచదేశాలతో పాటు భారత్‌నూ కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్‌ యాత్ర ఈ ఏడాది భారత్‌ నుంచి ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ప్రకటించారు. కరోనా ప్రభావం కారణంగానే సౌదీ అరేబియా ప్రభుత్వ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

హజ్ యాత్ర కోసం దరఖాస్తు రుసుము మొత్తం వాపస్‌ ఇస్తున్నట్లు తెలిపారు. డైరెక్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా డబ్బులు వెనక్కి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం 2300 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది అనుమతి లభించిన వారు అంతా 2021లో దానిని వినియోగించుకోవచ్చని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

కరోనా కారణంగా ఈ ఏడాది భారత్‌ నుంచి హజ్‌ యాత్రకు ఎవరూ వెళ్లకపోవచ్చన్న మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. ఏర్పాట్లు చేయడానికి సమయం దగ్గరపడినప్పటికీ, యాత్రికులకు అనుమతిచ్చే విషయమై సౌదీ అరేబియా నుంచి వచ్చే సమాచారం కోసం ఇప్పటివరకూ వేచి చూశారు. తాజాగా ఆ ప్రభుత్వమే వద్దని చెప్పడంతో యాత్రపై స్పష్టత వచ్చింది. భారత్‌-సౌదీ అరేబియాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ఏడాది 2 లక్షల మందికి అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే, సౌదీలోనూ కరోనా వ్యాపించడంతో యాత్ర రద్దు చేశారు.

ఇస్లాం విధుల్లో హజ్‌ యాత్ర ఒకటి. సౌదీ అరేబియాలోని మక్కాలోని కాబాను సందర్శించడమే హజ్‌ యాత్ర. జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్‌ యాత్ర చేయాలన్నది ముస్లింల ఆశయం. ఇస్లామిక్‌ కాలమానం ప్రకారం 12వ మాసం.. ‘జిల్‌ హజ్‌’ నెలలో పవిత్ర యాత్ర ఉంటుంది. ఆగస్టులో జిల్‌ హజ్‌ నెల వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని