పెద్దపులికి.. పెద్దకష్టం

రాజసానికి మారు పేరైన పెద్దపులిని కూడా కరోనా వదలడం లేదు. నల్లమల కేంద్రంగా ఏర్పాటు చేసిన నాగార్జునసాగర్‌ -శ్రీశైలం పులుల అభయారణ్యంలో ఉన్న పులుల సంరక్షణ అధికారులకు సవాలుగా

Updated : 24 Jun 2020 07:32 IST

● కరోనా సోకకుండా ప్రత్యేక ఏర్పాట్లు

● నల్లమల అభయారణ్యంలో అధికారుల అప్రమత్తత

రాజసానికి మారు పేరైన పెద్దపులిని కూడా కరోనా వదలడం లేదు. నల్లమల కేంద్రంగా ఏర్పాటు చేసిన నాగార్జునసాగర్‌ -శ్రీశైలం పులుల అభయారణ్యంలో ఉన్న పులుల సంరక్షణ అధికారులకు సవాలుగా మారింది. కరోనా వైరస్‌ సోకకుండా పులులను కాపాడుకునేందుకు వన్యప్రాణుల సంరక్షణ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో విస్తరించి ఉన్న నల్లమలలో నలభైకు పైగా పులులు ఉన్నాయి. అమెరికాలోని జంతు ప్రదర్శనశాలలో పెద్దపులికి కరోనా సోకడంతో జాతీయ పులుల సంరక్షణ అథారిటీ(ఎన్‌టీసీఏ) అప్రమత్తమైంది.

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే (ప్రకాశం): కరోనా నుంచి జాతీయ జంతువు పెద్దపులి సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. పులుల అభయారణ్యాల్లో నల్లమలకు ప్రత్యేక స్థానం ఉంది. విస్తీర్ణంలో దేశంలో రెండో స్థానంలో ఉంది. మన రాష్ట్రంలోని ప్రకాశం, కర్నూలు, గుంటూరు, తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో 5838 చ.కి.మీల పరిధిలో విస్తరించి ఉంది. దానిలో 3568 చ.కి.మీలు పెద్దపులుల అభయారణ్యం ఉంది. మన రాష్ట్రంలో 1401 కి.మీలు ఉండగా దానిలో 900 చ.కిమీలు మన జిల్లా పరిధిలో మార్కాపురం అటవీ డివిజన్‌లో ఉంది. ఈ ప్రాంతం పెద్దపులుల ఆవాసానికి అనువైనదిగా అధికారులు చెబుతుంటారు.

అడవిలోకి కరోనా రాకుండా..

నల్లమల అటవీ ప్రాంతంలోకి కరోనా వైరస్‌ వ్యాపించకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మైదాన ప్రాంత వ్యక్తులు అడవిలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. పశువులు, గొర్రెలు, జీవాల మేత కోసం వెళ్లేవారిని కట్టడి చేస్తున్నారు. పులుల సంరక్షణ కోసం నియమించిన టైగర్‌ట్రాకర్స్‌కి మాస్కులు, శానిటైజర్లు అందించారు. వన్యప్రాణులు నీరు తాగే ప్రాంతాల్లో బ్లీచింగ్‌ చల్లి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెంచు గిరిజనులు ఫలసాయాలకు అటవీ లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అటవీ సమీపంలో ఉన్న గిరిజన గూడేలను అప్రమత్తం చేశారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పులుల సంరక్షణకు పెద్దపీట

నల్లమలలోని పెద్దపులులకు కరోనా సోకకుండా పటిష్ట చర్యలు చేపట్టాం. వాటి సంరక్షణ కోసం విధులు నిర్వర్తిస్తున్న బేస్‌క్యాంపు సిబ్బందికి, ఉద్యోగులకు శానిటైజర్‌లు, మాస్కులు పంపిణీ చేశాం. పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చే సిబ్బందిని రెండు, మూడు రోజుల పాటు ఇంటి వద్దనే ఉంచి ఆరోగ్యంగా ఉంటేనే అడవిలోకి అనుమతిస్తున్నాం. ఎకోటూరిజం ప్రాంతాల్లో సందర్శకులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. - భబిత, డీఎఫ్‌వో, మార్కాపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని