గ్యాస్‌ లీకేజీ..నివేదికలో ఏం చెప్పారంటే?

విశాఖపట్నం పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీకేజీ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో విచారణ జరిగింది.

Published : 06 Jul 2020 14:08 IST

దిల్లీ: విశాఖపట్నం పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీకేజీ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో విచారణ జరిగింది. వార్తా కథనాల ఆధారంగా ఎన్జీటీ కేసును సుమోటోగా తీసుకుంది. ఈ ఘటనపై ట్రైబ్యునల్‌కు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ స్టేటస్ రిపోర్ట్ సమర్పించారు.  నలుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీ... సాయినార్ లైఫ్ సైన్సెస్‌లో హైడ్రోజన్ సల్ఫైడ్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని తేల్చింది. బెంజిన్ మెడిజోన్ మూలద్రావణం వెళ్లే పైపును రియాక్టర్‌కు సరిగా అమర్చకపోవడంతో గ్యాస్ లీకైనట్లు గుర్తించామని కమిటీ నివేదికలో పేర్కొంది.

‘‘గ్యాస్‌ లీకేజీ ఘటనలో అక్కడే ఉన్న ఇద్దరు మృతి చెందగా.. వారిని కాపాడేందుకు వెళ్లిన నలుగురు గాయపడ్డారు. గాయపడిన నలుగురిలో ముగ్గురు కోలుకున్నారు. కంపెనీలో భద్రతా ప్రమాణాలు పాటించలేదు. ప్రమాదం తర్వాత కంపెనీలో ఉత్పత్తిని నిలిపేశారు. మృతుల కుటుంబాలకు ఫార్మా కంపెనీ రూ. 35 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది.  కంపెనీ మూసివేతకు  ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చింది. పరిశ్రమల విభాగం కంపెనీపై నిషేధిత ఆదేశాలు ఇచ్చింది. పరవాడ పోలీస్ స్టేషన్‌లో కంపెనీపై ఐపీసీ 304-II, 278, 284, 285, 337, 338 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’’ అని కమిటీ నివేదికలో పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని