9 ఏళ్లలో 139 మంది అత్యాచారం.. మహిళ ఫిర్యాదు

బతుకుతెరువు కోసం హైదరాబాద్‌ వచ్చిన తనను కొందరు భయపెట్టి.. బలాత్కరించారని..

Updated : 22 Aug 2020 14:45 IST

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, పంజాగుట్ట: బతుకుతెరువు కోసం హైదరాబాద్‌ వచ్చిన తనను కొందరు భయపెట్టి.. బలాత్కరించారని.. తొమ్మిదేళ్లలో 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని నల్గొండ జిల్లాకు చెందిన బాధిత మహిళ శుక్రవారం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. తనపై అఘాయిత్యానికి పాల్పడ్డ వారంతా చంపేస్తానంటూ బెదిరించడంతో ప్రాణభయంతో మౌనంగా ఉన్నానని, సోమాజిగూడలోని ఓ స్వచ్ఛంద సేవాసంస్థ సాయంతో ఫిర్యాదు చేస్తున్నానని పోలీసులకు వివరించింది. తొమ్మిదేళ్ల క్రితం తనకు వివాహమైందని, ఏడాదికే విడాకులు తీసుకున్నానని పేర్కొంది. అనంతరం తాను చదువుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చానంది. కొద్దిరోజుల తర్వాత ఓ వసతి గృహానికి వెళ్లగా.. అక్కడికి వచ్చిన సుమన్‌ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో అతని వద్దకు వెళ్లానని.. అక్కడ తనను బలాత్కారం చేశారని ఆవేదన చెందింది. అప్పటి నుంచి అతనితో పాటు స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారని తెలిపింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో కొందరు సినీనటులు, మాజీ ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడు ఉన్నారంది.  తనను బెదిరించి నగ్నంగా నృత్యాలు చేయించారని, మద్యం తాగించారని, వీడియోలు తీశారని వాపోయింది. తనను ఈ రొంపిలోకి దించిన సుమన్‌ సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్నాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు నిర్భయ చట్టంతో పాటు ఐపీసీ 376 సెక్షన్‌, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈమేరకు దర్యాప్తు చేపట్టామని పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని