Home Isolationలో ఇక్కట్లు..

గ్రేటర్‌ పరిధిలో వేలాదిగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ శాతం మంది హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

Updated : 27 Apr 2021 12:03 IST

 వాయువేగంతో కరోనా వ్యాప్తి
జాగ్రత్తలు అవసరమంటున్న నిపుణులు

గ్రేటర్‌ పరిధిలో వేలాదిగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ శాతం మంది హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ప్రత్యేక గదిలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయినా సరే కొన్ని చోట్ల వైరస్‌ వాయువేగంతో వ్యాప్తి చెందుతోంది. ఈ మధ్యనే నార్సింగిలోని ఓ గెటెడ్‌ కమ్యూనిటీలో వంద మందికి పైగా వైరస్‌ సోకినట్లు వార్తలొచ్చాయి. వ్యాప్తికి అడ్డుకట్టవేసేలా చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణం.

• ఉప్పల్‌ సర్కిల్‌లోని ఓ ప్రాంతంలో వైరస్‌ సోకిన వ్యక్తిని ఇంటి వద్దే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇంట్లో ఐదుగురు సభ్యులుండగా రెండు రోజుల వ్యవధిలో మరో ఇద్దరికి వైరస్‌ సోకింది. ఒకే బాత్‌రూమ్‌ వినియోగించడం, ఇంట్లో తగిన జాగ్రత్తలు పాటించకపోవడమే ఇందుకు కారణం.

• అదే సర్కిల్‌లోని మరో ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లోని ఓ కుటుంబంలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ భవనంలో ఉన్న ఐదారు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. పాజిటివ్‌ కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటున్నా, తాగునీరు పట్టుకునేటప్పుడో..  .సరకులు తీసుకునేందుకో బయటకు వస్తే ఇతరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. క్షణక్షణం భయంతో వణికిపోతున్నారు.

అందరికీ సాధ్యం  కావడం లేదు...

అందరి ఇళ్లలో సురక్షిత హోం ఐసొలేషన్‌ సాధ్యపడడం లేదు. ఒకటి, రెండు ఇరుకైన గదుల్లో ఉండే కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. ఇరుకుగా ఉండే ఇళ్లలో పాజిటివ్‌ వ్యక్తి ఉంటే సురక్షితంగా ఎలా ఉండగలం..? అని అంబర్‌పేటకు చెందిన ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ‘మా ఇంట్లో ఒకే బాత్‌రూం ఉంది. మేమేం చేయాలి. జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి’ అని వనస్థలిపురంలో నివసించే పాజిటివ్‌ వ్యక్తి కుటుంబసభ్యులు వాపోయారు. వృద్ధులు, చిన్నారులు ఉన్న కుటుంబాలు మరింత వేదనకు గురవుతున్నాయి. ‘ఎల్బీనగర్‌కు చెందిన ఓ కుటుంబ పెద్దకు పాజిటివ్‌ రాగా తమ కుటుంబ సభ్యులకు నిర్ధారణ పరీక్షలు చేయించేందుకు నేరుగా ఆయనే పరీక్షా కేంద్రం వద్దకు వచ్చారు. ఆయన్ని గుర్తు పట్టిన సిబ్బంది అతనికి దూరంగా ఉండమంటూ ఇతరుల్ని వారించారు. తప్పని పరిస్థితుల్లో బయటికి వచ్చానంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

మాస్కు, భౌతిక దూరమే రక్ష 

ఐసొలేషన్‌ గదిలో గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. సహాయకులతో సామాజిక దూరం పాటించాలి. కుటుంబంలోని ఇతర సభ్యులు ఫేస్‌షీల్డ్, గ్లోవ్స్‌ వాడటం మంచిది. గోరువెచ్చటి నీటిని తాగుతూ ఉండాలి. ఏ అనారోగ్య లక్షణాలు లేనివాళ్లు మాత్రమే కేర్‌ టేకర్స్‌గా ఉండాలి. పేషెంట్‌ గదిలోకి లేదా దగ్గరికి వెళ్లినప్పుడు కనీసం ఆరడుగుల దూరం పాటించాలి. మూడు లేయర్స్‌ ఉన్న మాస్కు ధరించాలి. ఇంటిని ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తూ ఉండాలి. - డా.ప్రభాకర్‌రెడ్డి, ఫార్మకాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, నిమ్స్‌

ఈ జాగ్రత్తలు అవసరం..

> నిద్ర, వ్యాయామం, స్నానం, భోజన సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి.

> ఉదయం లేవగానే కరోనా రోగి తన గదిని తనే రసాయనాలతో శుభ్రం చేసుకోవాలి. దుస్తులను వేడి నీటిలో ఉతికి ఆరబెట్టుకోవాలి. తన వస్తువుల్ని, పాత్రల్ని తనే కడుక్కోవాలి.

> రోజూ వ్యాయామం, యోగా, ధ్యానం చెయ్యాలి, బలమైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి, వైద్యుల సలహా ప్రకారం మందులు వాడాలి, పేషెంట్, తన కుటుంబ సభ్యులు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారితో సామాజిక దూరాన్ని పాటించాలి. థర్మల్‌ స్కానర్, పల్స్‌ ఆక్సీ మీటర్‌ ద్వారా ఆక్సిజన్‌ స్థాయిల్ని సొంతంగా పరిశీలించుకోవాలి.

> ఇతరుల్ని ఇంటికి రానివ్వకూడదు. ముందుగానే సమాచారం ఇవ్వాలి.

> రోగి వస్తువుల్ని ఇతరులు తాకకుండా జాగ్రత్తగా ఉండాలి.

మాస్కులు, దుస్తులు వస్తువుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొనే వాడాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని