AP News: ఉద్యోగోన్నతా.. మనోడైతే చాలు!.. బెజవాడ కనకదుర్గ గుడిలో వివాదం

వడ్డించే వాడు మనవాడైతే చివరి వరుసలో కూర్చున్నా ఢోకా ఉండదు అన్నట్టుగా మారింది దుర్గగుడిలోని ఉద్యోగోన్నతుల ప్రక్రియ.. నిన్నటి వరకు జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ

Updated : 28 Jul 2021 12:46 IST

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: వడ్డించే వాడు మనవాడైతే చివరి వరుసలో కూర్చున్నా ఢోకా ఉండదు అన్నట్టుగా మారింది దుర్గగుడిలోని ఉద్యోగోన్నతుల ప్రక్రియ.. నిన్నటి వరకు జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ ఉద్యోగికి నేరుగా సూపరింటెండెంట్‌ ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో తోటి సిబ్బంది కంగుతిన్నారు. దేవాదాయశాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారి సహకారంతోనే ఇదంతా జరగడం.. పైగా రెండ్రోజుల క్రితమే పదోన్నతుల కల్పనలో కోర్టు వివాదాలకు తావు ఇవ్వొద్దని దేవాదాయ శాఖ మంత్రి చెప్పిన నేపథ్యంలో ఆయా నిబంధనలు పక్కకు నెట్టి ఓ మహిళకు ఉద్యోగోన్నతి కల్పించడం చర్చనీయాంశమైంది. తొలుత ఇద్దరు ఉద్యోగులకు సూపరింటెండెంట్‌గా ఉద్యోగోన్నతి పొందేందుకు అవకాశం కల్పించారు. ఇందులో ఒక వ్యక్తి వెంటనే బాధ్యతలు చేపట్టగా.. మరో మహిళా ఉద్యోగి స్వీకరించలేదు. ఈ క్రమంలోనే ఆ పదోన్నతికి సంబంధించిన ఉత్తర్వులు తీసుకుని వేరొక మహిళ రావడంతో వివాదాస్పదం అయ్యింది. వాస్తవానికి కొత్తగా వచ్చిన మహిళ గతంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఒకవేళ ఆమెకు ఉద్యోగోన్నతి కల్పిస్తే సీనియర్‌ అసిస్టెంట్‌ ఇవ్వాలి కానీ సూపరింటెండెంట్‌ ఏవిధంగా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరో వివాదంలో ఇలా...

దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం మాసపత్రిక కనకదుర్గ ప్రభకు ఎడిటర్‌ పోస్టు ఖాళీ కావడంతో అందులో పనిచేసే ఓ ఉద్యోగి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి ఏఈవో క్యాడర్‌తో సమానమైన ఎడిటర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. తనక ఆ ఉద్యోగం వస్తుందనుకున్న తరుణంలో సదరు ఉద్యోగికి ఆ పోస్టు దక్కకుండా కొందరు వివాదాస్పదం చేశారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం

- ఈవో భ్రమరాంబ

ఉద్యోగోన్నతి కల్పన విషయంలో ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు, కోర్టు ఉత్తర్వుల మేరకు నిర్ణయం తీసుకుంటాం. విద్య, సీనియారిటీని పరిగణనలోకి తీసుకున్న తర్వాత పదోన్నతులు కల్పిస్తాం. దుర్గగుడిలో ప్రస్తుతం మూడు సూపరింటెండెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నందున మరోసారి సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని