Votes Counting: 19న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

హైకోర్టు తీర్పు నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది.

Updated : 17 Sep 2021 09:24 IST

ఈనాడు, అమరావతి: హైకోర్టు తీర్పు నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఈ నెల 19న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, లెక్కింపు ముగియగానే ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ గురువారం రాత్రి పొద్దుపోయాక వెలువడింది. పోటీ చేసిన అభ్యర్థులు తమ కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు అందజేయాలని కూడా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. లెక్కింపు ఏర్పాట్లపై శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. సమావేశం ఎజెండా ఇప్పటికే జిల్లా అధికారులకు చేరింది. గురువారం కోర్టు తీర్పు వెలువడే సమయానికి ఎస్‌ఈసీ నీలం సాహ్ని దిల్లీలో ఉన్నారు. తీర్పు రాగానే ఆమె హుటాహుటిన బయల్దేరి సాయంత్రానికి విజయవాడ చేరుకున్నారు. రాష్ట్రంలో 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్‌ 8న పోలింగ్‌ జరిగింది. రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలుండగా, వాటిలో 2,371 ఏకగ్రీవమయ్యాయి. 375 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 81 చోట్ల అభ్యర్థులు చనిపోవడంతో ఎన్నిక వాయిదాపడింది. రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలుండగా... వాటిలో 126 చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. 8 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. 11 చోట్ల అభ్యర్థులు చనిపోవడంతో వాయిదాపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని