Carl Vinson: విశాఖ తీరాన ‘బాహుబలి’

అమెరికాకు చెందిన సుప్రసిద్ధ విమాన వాహక అణు యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ కార్ల్‌ విన్సన్‌ (సీవీఎన్‌-70) విశాఖ నగరానికి వచ్చింది.

Updated : 14 Oct 2021 10:58 IST

అమెరికా విమాన వాహక అణు యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ కార్ల్‌ విన్సన్‌ 
మలబార్‌ విన్యాసాల కోసం సాగర నగరానికి రాక 

ఈనాడు, విశాఖపట్నం: అమెరికాకు చెందిన సుప్రసిద్ధ విమాన వాహక అణు యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ కార్ల్‌ విన్సన్‌ (సీవీఎన్‌-70) విశాఖ నగరానికి వచ్చింది. బంగాళాఖాతంలో జరుగుతున్న మలబార్‌ ఫేజ్‌-2 విన్యాసాల్లో పాల్గొనడానికి దాన్ని అమెరికా నౌకాదళం విశాఖకు పంపింది. యుద్ధవిన్యాసాల్లో అత్యంత ఖరీదైన విమాన వాహక యుద్ధనౌకలను  వినియోగించడం చాలా తక్కువగా ఉంటుంది. విశాఖ కేంద్రంగా త్వరలో భారత్‌కు చెందిన విమాన వాహక యుద్ధనౌక విక్రాంత్‌ను మోహరించనున్న నేపథ్యంలో తాజా విన్యాసాల్లో అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్‌ కార్ల్‌విన్సన్‌ రావడం విశేషం.

ప్రత్యేకతలెన్నో..

అమెరికా నౌకాదళంలో యూఎస్‌ఎస్‌ కార్ల్‌విన్సన్‌ విమాన వాహక యుద్ధనౌకను 1980లో ప్రవేశపెట్టారు. జార్జియాకు చెందిన ప్రముఖ నాయకుడు కార్ల్‌ విన్సన్‌ యూఎస్‌ నౌకాదళానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరును దీనికి పెట్టారు. 1983 నుంచి ఇది సేవలందిస్తోంది. కాలానుగుణంగా అత్యాధునిక సదుపాయాలతో ఆధునికీకరిస్తూ             ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు తీర్చిదిద్దారు. సాధారణ విమాన వాహక యుద్ధనౌకలతో పోలిస్తే దీని పరిమాణం, సౌకర్యాలు అన్నీ భారీగానే ఉంటాయి.
- దీనిపై నుంచి క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. యుద్ధనౌక లక్ష్యంగా వచ్చే క్షిపణులను, టోర్పెడోలను క్షణాల్లో గుర్తించగలిగే అధునాతన వ్యవస్థలన్నీ ఇందులో ఉన్నాయి. 
- శత్రుదేశాలపై ఒక్కసారిగా దాడి చేయడానికి వీలుగా దీనిపై అధునాతన యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ఉంటాయి. 
- ఈ నౌక ఇరాక్‌ యుద్ధంతోపాటు ‘డిసర్ట్‌ స్ట్రైక్‌’, ‘సదరన్‌ వాచ్‌’, ‘ఎండ్యూరింగ్‌ ఫ్రీడం’ తదితర ఆపరేషన్లలో కీలకపాత్ర పోషించింది. 
- ఒసామా బిన్‌ లాడెన్‌ మృతదేహాన్ని ఈ యుద్ధనౌకలోనే తరలించి సముద్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. 
నౌక ప్రత్యేకతలు
బరువు    :    1,13,500 టన్నులు 
పొడవు    :    1,092 అడుగులు 
వెడల్పు    :    252 అడుగులు 
వేగం    :    గంటకు 56 కి.మీ.లు 
సిబ్బంది    :    6,012 మంది 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని