Cm Kcr: ధాన్యం కొనుగోలుపై కేంద్రం రోజుకో మాట చెబుతోంది: కేసీఆర్‌

ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందని.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రోజుకో మాట చెబుతోందని విమర్శించారు. ధాన్యం విదేశాలకు ఎగుమతి...

Published : 08 Nov 2021 01:24 IST

హైదరాబాద్‌: ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందని.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రోజుకో మాట చెబుతోందని విమర్శించారు. ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదని.. ధాన్యం సేకరణ, నిల్వ, ఎగుమతి వంటి అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నాయన్నారు. రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పిందన్నారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో... ధాన్యం సేకరణ, పంటల సాగు, పెట్రో ధరలపై సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

కేసీఆర్‌ను జైలుకి పంపిస్తారా? ముట్టి చూడు బిడ్డా!

‘‘కేసీఆర్‌ను జైల్లో పెడతామని బండి సంజయ్‌ అంటున్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపే దమ్ము భాజపా నేతకు ఉందా? కేసీఆర్‌ని టచ్‌ చేసి చూడు.. బతికి బట్టకడతావా? మీరు ధర్నాలు చేయడం కాదు.. రేపట్నుంచి మేం ధర్నాలు చేస్తాం. ఉత్తర భారత రైతులకు మద్దతుగా ధర్నా చేస్తాం. సాగు చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తాం. కేంద్రంపై పోరాడుతున్న రైతులకు అండగా ఉంటాం. ఉత్తర భారత రైతులకు మద్దతుగా ధర్నాలు చేస్తాం. దిల్లీ భాజపా వరి వేయెద్దని అంటోంది... ఇక్కడ సిల్లీ భాజపా వరి వేయాలని చెప్తోంది. కేంద్రం వరి ధాన్యం కొంటుంటే నేను వద్దన్నానా? వరి కొంటామంటూ కేంద్రం నుంచి భాజపా నేతలు లేఖ తేవాలి. వానాకాలం ధాన్యం మొత్తం కొనే వరకు భాజపాను నిద్రపోనివ్వను.

పెట్రోల్‌ ధరలు పెంచిన వాళ్లే తగ్గించాలి: కేసీఆర్‌  
పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం అద్భుతంగా అబద్ధాలు చెబుతోంది. కేంద్రం రాష్ట్రాల వాటా ఎగ్గొడుతూ సెస్‌ పెంచింది. ఈ ఏడేళ్లలో క్రూడాయిల్‌ ధర ఎప్పుడూ 105 డాలర్లు దాటలేదు. బ్యారెల్‌ ధర 30 డాలర్లు ఉన్నప్పుడు కూడా భారీగా ధర పెంచారు. కేంద్రం రాష్ట్రాల వాటా ఎగ్గొడుతూ సెస్‌ పెంచింది. దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో భాజపాను ప్రజలు దెబ్బకొట్టారు. అందుకే కొండంత పెంచిన పెట్రో ధరలను పిసరంత తగ్గించారు. 
భాజపా నేతలు అడ్డగోలుగా మాట్లాడితే ఇకపై సహించం. ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడితే చీల్చి చెండాడుతాం. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని విధాలుగా పోరాడుతాం. పెట్రోల్‌. డీజిల్‌పై మేము నయా పైసా పెంచేది లేదు. రాష్ట్రంలో వ్యాట్‌ ఒక్క రూపాయి కూడా పెంచేది లేదు, తగ్గించేది లేదు. చమురుపై కేంద్రం విధిస్తున్న సెస్‌ను రద్దు చేయాలి. పెట్రోల్‌ ధరలు పెంచిన వాళ్లే తగ్గించాలి. పెట్రోల్‌ ధర పెంపునకు కారణమైన వాళ్లను నిలదీస్తాం. చమురుపై కేంద్రం విధిస్తున్న సెస్‌ను రద్దు చేయాలి.

ప్రభుత్వ చర్యల వల్ల వ్యవసాయ స్థిరీకరణ..

యాసంగిలో వరి పంట వేయకుండా ఇతర పంటలు వేయాలని నిన్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే మంత్రి వివరించారు. కారణం ఏమిటంటే.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటోందని స్పష్టంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పడు రైతుల ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రం కకావికలమైన పరిస్థితి ఉండేది. తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  స్థిరమైన లక్ష్యంతో, నిర్ణయాత్మక పద్ధతిలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం బలమైన అడుగులు వేసింది. ఆ ప్రక్రియలో మొదటి దశగా భూగర్భ జలాలను పెంచేందుకు మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువులను అభివృద్ధి చేశాం. ఆ తర్వాత నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేశాం. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.10వేలు ఇచ్చాం. చిన్న రైతులు చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయని రూ.1,400 కోట్లు వెచ్చించి.. రైతు బీమా పథకం ద్వారా రైతుల ప్రీమియం కూడా చెల్లిస్తున్నాం. విత్తనాలు కూడా దొరికేవి కావు, కల్తీ విత్తనాలు అమ్మేవారు. కేంద్రంతో పోరాడి, ఒప్పించి కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్టు తెచ్చాం. ఎరువులు దొరికేవి కావు. పోలీస్‌ స్టేషన్‌లలో పెట్టి ఎరువులు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. అప్పటికీ ఇప్పటికీ ఎరువుల వినియోగం 3 రెట్లు పెరిగింది. అయినా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చేశాం. ఇలా అనేక చర్యలు చేపట్టాం. దీంతో అద్భుతమైన వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. కరోనా విపత్తు కాలంలో నెలల తరబడి రాష్ట్రంలో పండిన ధాన్యం సంపూర్ణంగా కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి మంచి లాభం జరుగుతుంది. రెండు పంటలు పండించుకోవచ్చు. నువ్వులు, పెసర్లు వేయొచ్చు. వరికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి.

బండి సంజయ్‌.. ఎవరి మెడలు వంచి కొనుగోలు చేయిస్తారు?

యాసంగి ధాన్యం నాణ్యతగా ఉండటం లేదని, తాలు, నూకలు ఎక్కువగా వస్తాయని కేంద్రం చెబుతోంది. యాసంగిలో రా రైస్‌ మాత్రమే కొంటామని, బాయిల్డ్‌ రైస్‌ కొనలేమని చెప్తోంది. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని లేఖ ఇవ్వాలని ఎఫ్‌సీఐ అడిగింది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనేక కొర్రీలు పెడుతోంది. బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేసేది లేదని కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలోనే నిన్న వ్యవసాయశాఖ మంత్రి యాసంగిలో వరి వేయద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. రైతులు వరి పంటనే వేయండి. ప్రభుత్వం మెడలు వంచి వరి పంట కొనుగోలు చేయిస్తాం అని చెబుతున్నారు. ఎవరి మెడలు వంచి కొనుగోలు చేయిస్తారు. కేంద్రం మెడలు వంచుతారా? ఓ వైపు కేంద్రం మేము ధాన్యం కొనుగోలు చేయమని కండీషన్‌ పెడుతుంటే.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బండి సంజయ్‌కు నెత్తి లేదు.. కత్తి లేదు. నా స్థాయి కాదని బండి సంజయ్‌ని ఇన్నాళ్లూ వదిలేశా. కానీ, చిల్లర రాజకీయాల కోసం రైతాంగం నష్టపోయేలా చేస్తున్నారు. రైతుల కోసమే ఇవాళ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నా. వర్షాకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పక పోయినా .. ధైర్యంగా ముందుకొచ్చి ఏదైతే అదవుతుందని కొనుగోలు చేస్తున్నాం. ఓ వైపు రైతులను కేంద్ర మంత్రి కార్లతో తొక్కిస్తున్నారు. రైతులను కొట్టాలని భాజపా సీఎంలు రెచ్చగొడుతున్నారు.

రైతుల జోలికొస్తే ఊరుకునేది లేదు..

భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే పార్టీ భాజపా. ఎన్నికలు వచ్చినప్పుడల్లా భావోద్వేగాలు రెచ్చగొడతారు. ఈ ఏడేళ్లలో దేశానికి ఏం చేశారో చెప్పాలి. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ కంటే భారత జీడీపీ తక్కువగా ఉంది. ప్రతి బావి వద్ద మీటర్‌ పెట్టమని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరణ చేస్తున్నారు. ఎల్‌ఐసీ వంటి బ్రహ్మాండమైన సంస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఇకపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర భాజపా వెంటపడతాం. దమ్ముంటే ప్రాజెక్టుల్లో అవినీతి జరిగినట్టు బయటపెట్టాలి. రైతును ముంచి రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఈ కుటిల నీతిని రైతులు గమనించాలి. ఏడేళ్లు పోరాడితేగాని రాష్ట్రానికి హైకోర్టు ఇవ్వలేదు. మీరు సహకరించకున్నా మేం సహకరించామని ప్రధానికి చెప్పా. ఎవరీ బండి సంజయ్‌? రాష్ట్రానికి ఏమైనా తెచ్చారా? హుజూరాబాద్‌లో గెలిచినంత మాత్రాన విర్రవీగుతున్నారు. నాగార్జున సాగర్‌లో భాజపాకు డిపాజిట్‌ రాలేదు. ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ మాది. ఎన్నికలు అన్నాక.. గెలుస్తాం.. ఓడుతాం. ఉప ఎన్నికల్లో భాజపా 30 సీట్లు పోగొట్టుకుంది. 2018 ఎన్నికల్లో 107 స్థానాల్లో భాజపాకు డిపాజిట్లు రాలేదు. తెలంగాణను అద్భుతమైన శక్తిగా నిలబెట్టిన వ్యక్తిని నేను. తెలంగాణలో అమలవుతున్న పథకాలు భాజపా రాష్ట్రాల్లో ఉన్నాయా? పాకిస్తాన్‌, చైనాను చూపి రెచ్చగొట్టడమే భాజపా పని. సరిహద్దులో చైనా ముందు తోకముడిచారు. మన సరిహద్దుల్లో చైనా వాడు ఊర్లకు ఊర్లే కడుతున్నారు. కొవిడ్‌ సమయంలో గంగానదిలో శవాలు తేలాయి. వ్యక్తిగతంగా నన్ను నిందించినా పట్టించుకోలేదు. కానీ,  తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతామంటే కేసీఆర్‌ ఊరుకోడు. రైతుల జోలికొస్తే ఊరుకునేది లేదు. వడ్లు కొనుగోలు చేయమని అవసరమైతే దిల్లీ వెళ్లి వేల మందితో ధర్నా చేస్తాం. పంజాబ్‌లో ధాన్యం మొత్తం సేకరించి, తెలంగాణలో ఎందుకు సేకరించరు. రాష్ట్రానికో న్యాయమా? కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హుందాగా మాట్లాడాలి. భాజపా ప్రభుత్వం రైతుల మీద భయంకరమైన కుట్ర పన్నుతోంది. మీ చేతగానితనం వల్ల దేశాన్ని నాశనం చేశారు. కేంద్రం పెంచిన పెట్రోల్‌ ధరల వల్ల అన్ని ధరలు పెరిగాయి’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని