AP Cabinet: 7న ఏపీ మంత్రిమండలి భేటీ మధ్యాహ్నానికి మార్పు

ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 7న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన

Published : 05 Apr 2022 10:13 IST

అదే రోజు మంత్రుల రాజీనామా?

ఈనాడు, అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 7న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ వివిధ శాఖల ఉన్నతాధికారులకు సోమవారం సమాచారమిచ్చారు. 7న ఉదయం 11 గంటలకు కేబినెట్‌ భేటీ నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడంతో మధ్యాహ్నానికి మారిందని తెలిసింది. నరసరావుపేటలో ఈ నెల 6న వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో సీఎం పాల్గొనాల్సి ఉంది. అయితే ఆయన రెండురోజుల పర్యటన నిమిత్తం మంగళవారం దిల్లీ వెళ్లనున్నారు. దీంతో వాలంటీర్లతో కార్యక్రమాన్ని 6న కాకుండా 7న ఉదయం ఏర్పాటు చేశారు. అందువల్ల మంత్రిమండలి సమావేశాన్ని ఆ రోజు ఉదయం కాకుండా మధ్యాహ్నానికి మార్చారని తెలిసింది.

11న కొత్త మంత్రుల ప్రమాణం

మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరెవరిని తప్పిస్తున్నారో ముఖ్యమంత్రి జగన్‌ 7న కేబినెట్‌ సమావేశంలో వెల్లడించనున్నారని తెలిసింది. దీంతో ఆయా మంత్రులు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వారి రాజీనామా విషయాన్ని ముఖ్యమంత్రి 8న గవర్నర్‌ను కలిసి వివరించి, వారి స్థానంలో కొత్తవారిని తీసుకునేందుకు అనుమతించాలని కోరతారని సమాచారం. గవర్నర్‌ ఆమోదం తెలపగానే అదేరోజు కొత్తగా మంత్రిమండలిలోకి వచ్చే వారికి సమాచారమిస్తారని అంటున్నారు. 11న ఉదయం 11:31 గంటలకు వెలగపూడిలోని సచివాలయ భవన సముదాయం పక్కనున్న స్థలంలో ఏర్పాటు చేయనున్న వేదికపై కొత్త మంత్రులతో గవర్నర్‌ ప్రమాణం చేయించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని