Hyderabad News: ముందైనా వెళ్లండి.. తర్వాతైనా రండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

‘‘భాజపా ఆధ్వర్యంలో పరేడ్‌ మైదానంలో ఆదివారం జరగనున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో నగరంలో పలుప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నాం..

Updated : 03 Jul 2022 11:04 IST

ప్రయాణికులు.. వాహనదారులకు సూచన 

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘భాజపా ఆధ్వర్యంలో పరేడ్‌ మైదానంలో ఆదివారం జరగనున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో నగరంలో పలుప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నాం.. ట్రాఫిక్‌ ఆంక్షల అమలుకు ముందైనా మీరు మీ గమ్యస్థానాలు చేరుకోండి.. లేదంటే బహిరంగ సభ పూర్తయ్యాక ఇళ్లకు రండి’’ అంటూ హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులను కోరారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నందున ఆయా మార్గాల్లో వెళ్లేందుకు అవకాశం ఉండదని ప్రత్యామ్నాయ మార్గాల్లోనే వెళ్లాలంటూ సంయుక్త కమిషనర్‌(ట్రాఫిక్‌) ఏవీ రంగనాథ్‌ తెలిపారు. అత్యవసర సమయాల్లో 040-27852482 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.  

ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా.. 

* ఆదివారం ట్రాఫిక్‌ ఆంక్షలు మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ కొనసాగుతాయి. ఎంజీరోడ్, ఆర్‌పీరోడ్, ఎస్‌డీరోడ్‌తో పాటు సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయి.
*హెచ్‌ఐసీసీ మాదాపూర్‌- జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌-రాజ్‌భవన్‌-పంజాగుట్ట-బేగంపేట విమానాశ్రయం- పరేడ్‌ మైదానం పరిసర ప్రాంతాల్లోనూ ఆంక్షలుంటాయి.
*టివోలీ క్రాస్‌రోడ్స్‌ నుంచి ప్లాజా రోడ్‌ మధ్య రహదారి మూసివేస్తారు. సికింద్రాబాద్‌ పరిధిలో పలు జంక్షన్లలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశాలున్నాయి.

ట్రాఫిక్‌ మళ్లింపులు..

*సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు రాకపోకలు కొనసాగించే ప్రయాణికులు.
* పంజాగుట్ట వైపు నుంచి ఖైరతాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ మీదుగా చిలకలగూడ ప్లాట్‌ఫాం 10 ద్వారా వెళ్లాలి. 
*ఉప్పల్‌ వైపు నుంచి వచ్చే వారు నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిలకలగూడ నుంచి రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాం10 ద్వారా వెళ్లాలి. 
* సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వేర్వేరు ప్రాంతాలకు చేరుకునే వారు ప్యారడైజ్, బేగంపేట రహదారులపై ప్రయాణించకండి.
*కరీంనగర్, నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనదారులు బాహ్యవలయ రహదారి నుంచి  నగరంలోకి ప్రవేశించాలి. 
*ఉప్పల్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా పంజాగుట్ట/అమీర్‌పేట వైపు వెళ్లే ప్రయాణికులు తార్నాక, రైల్‌ నిలయం కాకుండా ఆర్టీసీ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్, హిమాయత్‌నగర్‌ లక్డీకాపూల్‌ మీదుగా వెళ్లాలి. 
*మేడ్చల్, బాలానగర్, కార్ఖానా, తిరుమలగిరి నుంచి సికింద్రాబాద్‌ వైపు వచ్చే ప్రయాణికులు నేరెడ్‌మెట్, మల్కాజిగిరి నుంచి వెళ్లాలి. 
*బహిరంగ సభ సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు మధ్యాహ్నం 2గంటలకు మొదలై.. రాత్రి 10గంటలకు పూర్తవుతాయి.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని