రాతి చెరువు భూములు కబ్జా

పెందుర్తి మండలం పెదగాడి పంచాయతీలో సర్వే సంఖ్య 420లో రాతి చెరువు భూములను వైకాపాకు చెందిన మాజీ సర్పంచ్‌ శ్రీనివాసరావు, అతని అనుచరులు కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చి విక్రయాలు.

Updated : 20 Jan 2023 06:52 IST

అధికారులకు తెదేపా ఫిర్యాదు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పెందుర్తి మండలం పెదగాడి పంచాయతీలో సర్వే సంఖ్య 420లో రాతి చెరువు భూములను వైకాపాకు చెందిన మాజీ సర్పంచ్‌ శ్రీనివాసరావు, అతని అనుచరులు కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చి విక్రయాలు సాగిస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. పెందుర్తి మండలం జెర్రిపోతుల పాలేనికి ఆనుకొని ఈ చెరువు ఉందన్నారు. జెర్రిపోతులపాలెం సర్పంచ్‌ మడక అప్పలరాజు, ఇతర తెదేపా నాయకులతో కలిసి గురువారం కలెక్టరేట్‌కు వచ్చిన బండారు.. కలెక్టర్‌ మల్లికార్జున, ఆర్డీఓను కలిసి ఫిర్యాదు చేశారు.

ఆక్రమణల అంశాన్ని తాము తహసిల్దార్‌ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పైగా అక్రమార్కులను వెనకేసుకు వస్తున్నారని మీడియాతో మాట్లాడుతూ బండారు ఆరోపించారు. ఇదే బృందం తప్పుడు పత్రాలు సృష్టించి జాతీయ రహదారుల సంస్థ నుంచి రూ.కోటి మేర షీలానగర్‌-సబ్బవరం రహదారి భూసేకరణలో లబ్ధి పొందారని ఆరోపించారు.

 చెరువు స్థలాన్ని ఆక్రమించి దర్జాగా విక్రయాలు సాగిస్తుంటే అడ్డుకోవాల్సిన యంత్రాంగం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజు సూచనల మేరకే తహసిల్దార్‌ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీని వల్లే సర్వే సంఖ్య 420లో జరుగుతున్న దారుణాలను కలెక్టర్‌, ఆర్డీఓ దృష్టికి తీసుకెళుతున్నామన్నారు.

  ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకుంటే తాము హైకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామన్నారు. ఒక వేళ తాను తప్పుడు  ఆరోపణలు చేసినట్లు నిరూపిస్తే కలెక్టరేట్‌ వద్ద  ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు. చింతగట్ల పంచాయతీలో, జుత్తాడలో కూడా స్థానిక వైకాపా నేతలు భూములు ఆక్రమించుకుంటున్నారని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని బండారు ఆరోపించారు.

కలెక్టరేట్‌ వద్ద నిరసనలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని