ఆయుష్‌ పోస్తానంటే.. అక్కున చేర్చుకోరే!

ఆయన వైద్యం చేస్తారంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. దేశంలోనే ప్రఖ్యాతగాంచిన అనేక ఆస్పత్రులు కనీసం కన్సల్టెన్సీ సేవలు అందించమని పోటీలుపడి ఆయనకు ఎర్రతివాచీ పరుస్తాయి.

Updated : 05 Feb 2023 06:39 IST

కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్న డాక్టర్‌ గోఖలే
నిధుల లేమితో పట్టించుకోని యంత్రాంగం
జీజీహెచ్‌లో అందుబాటులోకి రాని గుండె శస్త్రచికిత్సలు
ఈనాడు-అమరావతి

మరమ్మతులకు నోచుకోని హార్ట్‌లంగ్‌మిషన్‌

ఆయన వైద్యం చేస్తారంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. దేశంలోనే ప్రఖ్యాతగాంచిన అనేక ఆస్పత్రులు కనీసం కన్సల్టెన్సీ సేవలు అందించమని పోటీలుపడి ఆయనకు ఎర్రతివాచీ పరుస్తాయి. కానీ అవేం వద్దనుకుని పేదోడికి అందించే వైద్యసేవల్లో కలిగే తృప్తి మరెందులోనూ ఉండదని ఆయన భావించారు. గుంటూరు ప్రభుత్వ బోధనాస్పత్రి (జీజీహెచ్‌)లో వైద్యసేవలు అందిస్తానని తిరుగుతుంటే అక్కున చేర్చుకోవాల్సిన యంత్రాంగం ఏవో సమస్యలు చెప్పి తప్పించుకుంటోంది. డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ప్రభుత్వ ఆహ్వానం మేరకు గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో తిరిగి గుండె శస్త్రచికిత్సలు, గుండెమార్పిడి వైద్యసేవలు అందించటానికి ముందుకొచ్చారు. ఆయన ప్రభుత్వాన్ని, ఆస్పత్రి యంత్రాంగాన్ని ఒక్కటే అడిగారు. ఒక వార్డు, శస్త్రచికిత్సలు చేయటానికి ఓటీ థియేటర్లు, పరికరాలు అప్పగించాలని మాత్రమే కోరారు. సహచర వైద్యులను తానే సమకూర్చుకుంటానని ఉన్నతాధికారులకు అభయమిచ్చారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల పూర్వ విద్యార్థిగా ఆస్పత్రి రుణం తీర్చుకోవటానికి ఖరీదైన గుండె శస్త్రచికిత్సలు, మార్పిడులు  ప్రభుత్వ ఆస్పత్రిలోనే పేదోళ్లకు అందించి వారికి పునర్జన్మనిస్తానంటే యంత్రాంగం కాలయాపన చేస్తోంది. వాస్తవానికి ఫిబ్రవరి 2 నుంచి ఆయన సేవలు అందించాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు. కానీ ఆయనకు సహాయ నిరాకరణే ఎదురయ్యింది.

రెండు మాసాల క్రితమే..

గత ఏడాది డిసెంబరు మొదటివారంలోనే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన సంప్రదింపులు జరిపారు. ప్రభుత్వ వర్గాలు స్పందించి గుంటూరు ఆస్పత్రి సూపరింటెండెంట్‌, కలెక్టర్‌, డీఎంఈలను ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు వార్డు సిద్ధం చేయలేదు. గత మూడేళ్ల క్రితం ఉన్న పరికరాలను కొవిడ్‌ సేవలు అటు, ఇటు మార్చారు. దీంతో అవి పాడైపోయాయి. వాటిని తిరిగి పునరుద్ధరించాలని కోరగా దానికి ప్రభుత్వం అంగీకరించింది. హార్టులంగ్‌ మిషన్‌, బెలూన్‌ పంపే యంత్రం పునరుద్ధరించటానికి సంబంధిత సరఫరాదారుడికి తొలుత కొంతమేరకు నిధులు విడుదల చేయాలి. నిధుల్లేవంటూ చేతులెత్తేశారు. కనీసం రూ.20 లక్షలు బడ్జెట్‌ కేటాయిస్తే తప్ప ఆ పరికరాలు పునరుద్ధరణకు నోచుకోవు. ఈ శస్త్రచికిత్సలు అందుబాటులోకి వస్తే ఆరోగ్యశ్రీ నుంచి పెద్ద మొత్తంలో ఆస్పత్రికి నిధులు వస్తాయి. కానీ ఆదిలో పెట్టుబడి పెట్టడానికి ఎవరికి వారు తమ వద్ద చేతిలో చిల్లిగవ్వలేదని తప్పించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని