వండుకో.. దండుకో!!

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌ ఏ చిన్న అవకాశం వచ్చినా దండుకోవడానికి కొందరు ప్రజాప్రతినిధులు వెనుకాడడం లేదు. దీనికి నగరంలోని రాత్రి ఆహార వీధి (నైట్‌ ఫుడ్‌ స్ట్రీట్‌) ప్రత్యక్ష ఉదాహరణ.

Updated : 09 Feb 2023 06:32 IST

‘రాత్రి ఆహార వీధి’లో ఇష్టారాజ్యం
అనధికారికంగా 120 వరకు
దుకాణాలు నేతల చేతికి భారీగా సొమ్ములు

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌ ఏ చిన్న అవకాశం వచ్చినా దండుకోవడానికి కొందరు ప్రజాప్రతినిధులు వెనుకాడడం లేదు. దీనికి నగరంలోని రాత్రి ఆహార వీధి (నైట్‌ ఫుడ్‌ స్ట్రీట్‌) ప్రత్యక్ష ఉదాహరణ.

ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలంటే సదరు ప్రజాప్రనిధులకు రూ.లక్షలు ముట్టజెప్పి ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఇక్కడి దుకాణాలకు ఎటువంటి అద్దె వసూలు చేయరు.

* దీంతో చిరు వ్యాపారుల నుంచి పోటీ పెరిగింది. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు జీవీఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు తెర వెనుక కథ నడిపించడం ప్రారంభించారు. డబ్బులిచ్చిన వారికి జీవీఎంసీ అనుమతి లేకుండానే అవకాశాలు ఇస్తున్నారు. దీని ప్రభావం ఆహార పదార్థాలపై ధరలపై పడింది. వ్యాపారులు స్టార్‌ హోటళ్ల స్థాయి ధరలను వసూలు చేస్తున్నారు.

తొలుత 32 మందితో ప్రారంభం..

జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ సంయుక్తంగా 2019లో వీధి, తోపుడుబళ్లు కార్మికులు 32 మందిని ఎంపిక చేసి సెంట్రల్‌ పార్కు పక్కన రాత్రి ఆహార వీధిని ప్రారంభించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు. రాత్రి వేళ యువత ఇక్కడికి అధికంగా వస్తుండడంతో వ్యాపారం లాభసాటిగా మారింది. దీంతో  స్థానికంగా ఉన్న నాయకులను కలిసి రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు నిధులిచ్చి పలువురు అనధికారికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన జీవీఎంసీ యూసీడీ అధికారులూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

* 2020 మార్చిలో కరోనా రావడంతో ఇక్కడి దుకాణాలను మూసివేశారు. ఆ సమయానికి 126 మంది వ్యాపారాలు చేసేవారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఏడాది వరకు ఇక్కడ దుకాణాలు తెరవడానికి జీవీఎంసీ అనుమతులు ఇవ్వలేదు. దీంతో వ్యాపారులు ఇద్దరు వైకాపా నేతల చుట్టూ తిరిగి పెద్ద మొత్తంలో సమర్పించి ప్రసన్నం చేసుకున్నారు. అనంతరం జీవీఎంసీ అనుమతి లేకుండానే దుకాణాలు తెరిచారు.

ఆహార పదార్థాల ధరలు ఇలా..

బిర్యానీ రూ.170, చికెన్‌ లాలీపప్‌ (నాలుగు) రూ.200, చిన్న చేప (కాల్చినది) రూ.200, కాస్త పెద్దదైతే రూ.400, ఇడ్లీ (రెండు)రూ.60, దోశ రూ.50, చికెన్‌ కట్లెట్ (మూడు) రూ.150, సోడా రూ.40, లస్సీ రూ.50, నూడిల్స్‌ (గుడ్డు) రూ.60, చికెన్‌ నూడిల్స్‌ రూ.150 ఇలా యథేచ్ఛగా ధరలు నిర్ణయించి విక్రయిస్తున్నారు.

రంగంలోకి రౌడీషీటర్లు..

ప్రస్తుతం ఇక్కడ 160 వరకు దుకాణాలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇటీవల ముగ్గురు రౌడీషీటర్లు ఇందులోకి ప్రవేశించి అన్నీతామై వ్యవహరిస్తున్నారు. ఇక్కడ దుకాణాలు అద్దెకు ఇస్తున్నా, ఒక వ్యక్తికి మూడు దుకాణాలు ఉన్నా.. జీవీఎంసీ అధికారులు కనీస చర్యలు తీసుకోవడంలేదు. ముగ్గురు రౌడీషీటర్లు ప్రతి నెలా ఒక్కో దుకాణం నుంచి రూ.10వేల వరకు వసూళ్లు చేసి అధికార పార్టీ నేతలకు ముట్టజెబుతున్నారు.

కమిటీతో ప్రయోజనమేదీ..

రాత్రి ఆహార విక్రయ కేంద్రంపై వచ్చిన ఫిర్యాదులతో జీవీఎంసీ మేయరు గొలగాని హరి వెంకటకుమారి ఒక కమిటీని నియమించారు. ఇప్పటి వరకు ఒకసారి మాత్రమే కమిటీ సమావేశమై వ్యాపారాలు చేస్తున్నవారి నుంచి ధ్రువీకరణపత్రాలు తీసుకుంది. అయితే వారే క్షేత్రస్థాయిలో వ్యాపారాలు చేస్తున్నారా లేదా అనే అంశంపై విచారణ జరపలేదు. నిబంధనల ప్రకారం స్థానికులకే ఇక్కడ అవకాశం కల్పించాలి. కాని 160 మందిలో 100 మంది వరకు స్థానికేతరులు కావడం గమనార్హం. వారి నుంచి ఎంతో కొంత వసూలు చేసుకోవడానికే కమిటీ ఏర్పాటు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని