మెరుపు చూసి మసలుకో!

అకాల వర్షం.. అనుకోకుండా వచ్చి పలకరించిఅనుకోని నష్టాలు మిగుల్చుతుంది. ఈ విషయం దశాబ్దాల అనుభవమే.

Updated : 19 Mar 2023 08:51 IST

పిడుగులు, వడగళ్లతో జాగ్రత్త అవసరం
న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం

అకాల వర్షం.. అనుకోకుండా వచ్చి పలకరించిఅనుకోని నష్టాలు మిగుల్చుతుంది. ఈ విషయం దశాబ్దాల అనుభవమే. సాంకేతికత పుణ్యమా అని గతంతో పోల్చితే ప్రస్తుతం ముందస్తుగా అప్రమత్తం కావడానికి ఆస్కారమేర్పడింది. అకాల వర్షాల సమయంలో ఏటా పిడుగుపాటుకు గురై ఉభయ జిల్లాల్లో చాలామంది మరణిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది.

వేసవి కాలంలో సాయంత్రం అకస్మాత్తుగా వర్షాలు ముంచుకొస్తుండటంతో మార్గమధ్యలో ఎక్కడ నీడ కనిపించినా తల దాచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది సరికాదని నిపుణుల మాట.
* వర్షం పడేపటప్పుడు వృక్షాల కింద తలదాచుకోకూడదు. పొడవైన చెట్లపై పిడుగులు పడే అవకాశం ఎక్కువ. బహిరంగ ప్రదేశాల్లోనూ ఆస్కారముంది.
* వ్యవసాయ క్షేత్రాల్లో ఫోన్లు వాడరాదు. మొబైల్‌ సిగ్నళ్లతో పిడుగు పడే అవకాశాలెక్కువ.
* పశువులను చెట్ల కింద, మేతకు బయటకు తీసుకెళ్లకుండా పాకల్లోనే కట్టేయాలి.
* నల్లని మబ్బులు ఆకాశమంతటా విస్తరించినప్పుడు పొలాల్లో సంచరించకుండా భవనంలో తలదాచుకోవాలి. లేదా ఉన్న స్థావరంలోనే మోకాళ్లపై కూర్చొని రెండు చెవులు మూసుకోవాలి.
* విద్యుత్తు సరఫరా అయ్యే పరికరాలకు దూరంగా ఉండాలి. వాటి సమీపంలోని నీటి ప్రవాహాన్ని తాకరాదు.
* ద్విచక్ర వాహనాలు, ఓపెన్‌టాప్‌ అంటే ట్రాక్టర్‌, జీపు వంటి వాటిపై ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే ఉత్తమం.


వ్యవసాయపరంగా...

* కోసి ఎండబెట్టిన సెనగ, పసుపు పంటలపై టార్పాలిన్లు ఏర్పాటు చేసుకోవాలి. లేదా సురక్షిత ప్రాంతానికి తరలించాలి.
* పొలాల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వేయడాన్ని వాయిదా వేసుకోవాలి.
* రైతులు స్మార్ట్‌ఫోన్‌లో డామిని మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 20-40 కిలోమీటర్ల పరిధిలో సంభవించే ఉరుములు, మెరుపులు, పిడుగుల సమాచారం 30 నిమిషాల ముందుగానే అందులో చెబుతారు.


మరో రెండు రోజులు..

- శ్రీలక్ష్మి, వ్యవసాయ వాతావరణ విభాగ శాస్త్రవేత్త

ఉభయ జిల్లాల్లో ఆది, సోమవారం ఉరుములు, మెరుపులు, పిడుగులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముంది. వడగళ్ల వాన పడే ఆస్కారముంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని