నకిలీలతో విలవిల

ఆక్వా రంగం నాణ్యత లేని సీడ్‌, నకిలీ మందులు, మేతలు, నిషేధిత యాంటీబయోటిక్స్‌తో కుదేలవుతోంది.

Updated : 28 Mar 2023 05:04 IST

ఆక్వా రంగాన్ని ముసురుకుంటున్న సమస్యలు
నష్టపోతున్న రైతులు

కలిదిండి, భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఆక్వా రంగం నాణ్యత లేని సీడ్‌, నకిలీ మందులు, మేతలు, నిషేధిత యాంటీబయోటిక్స్‌తో కుదేలవుతోంది. పెట్టిన పెట్టుబడులూ రాక రైతు నష్టాలను చవిచూస్తున్నారు. ఓ వైపు ధరల పతనం.. ఇంకోవైపు వైరస్‌ల ధాటికి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రైతులు చెరువులను ఖాళీగా వదిలేయలేక.. సాగు కొనసాగించలేక కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యధిక ఆదాయ వనరుగా నిలుస్తోన్న ఆక్వా రంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉంది.  
విదేశాలకు ఎగుమతి చేసే సమయంలో మైక్రోబయాలజీ ల్యాబ్‌ల్లో రొయ్యల నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో అధికశాతం యాంటీబయోటిక్స్‌ వినియోగించినట్లు నిర్ధారణ కావడంతో సరకును వెనక్కి పంపించి వేస్తున్నారు. ఇలా తిరస్కరణకు గురైన సుమారు రూ.100 కోట్ల విలువైన రొయ్యలు సముద్రం పాలైనట్లు అంచనా. వెనక్కి వచ్చిన సందర్భంలో సరకును స్థానిక మార్కెట్లో విక్రయించాల్సిన పరిస్థితి. ఈ సాకుతో ధరల పతనానికి దళారులు తెగబడి రైతులను నిలువెల్లా ముంచేస్తున్నారు.
* ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో నకిలీ రొయ్యల మందులు సరఫరా చేస్తున్న కొందరిపై ఇటీవల కేసు నమోదైంది. ఓ కంపెనీకి చెందిన మందుల్లో సున్నం కలిపి రైతులకు విక్రయిస్తున్నారు. అవి నకిలీవని గుర్తించిన రైతులు సదరు కంపెనీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలంలోని ఓ ఆక్వా దుకాణంలో భీమవరం ఔషధ తనిఖీ అధికారులు ఇటీవల దాడులు చేసి నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న రూ.8.21 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు.
* పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఇటీవల ఔషధ నియంత్రణ శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో అక్రమంగా విక్రయిస్తున్న యాంటీ బయోటిక్స్‌ తయారీలో వినియోగించే ముడిసరకును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి సరకు దిగుమతి అవుతున్నట్లు గుర్తించారు.

కలిదిండిలోని రొయ్యల చెరువు


అరకొర తనిఖీలు

ఏలూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ప్రత్యక్షంగా వేలాది మంది రైతులు, పరోక్షంగా ఎంతో మంది జీవిస్తున్నారు. నష్టాలు వచ్చినప్పుడు వీరందరిపై ప్రభావం ఉంటోంది. అధిక పెట్టుబడులు పెట్టలేక.. తక్కువ ధరలకు వచ్చే మేతలు, మందులను వినియోగించేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. దీంతో అనుకున్న కౌంటు రాకుండానే మృత్యువాత పడుతుండటంతో కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నారు. సాగుదారులు పెట్టుబడి నిమిత్తం గతంలో చేసిన అప్పుల్ని తీర్చలేక.. ఈ పంట బాగా పండితే అవి తీరిపోతాయన్న ఆశతో సాగును వదల్లేక విలవిల్లాడుతున్నారు. సీˆడ్‌, మేతలు, మందులు, యాంటీ బయోటిక్స్‌పై సంబంధిత అధికారులు అరకొర తనిఖీలతో సరిపెడుతున్నారు. నమోదైన కేసుల్లోనూ పురోగతి ఏమిటన్నది తెలియడం లేదు.


ఆరోగ్యంపై దుష్ప్రభావం

‘ఆక్వా సాగులో నకిలీ మందులు, మేతలు, నిషిద్ధ యాంటీబయోటిక్స్‌ వాడితే తీవ్ర నష్టాలుంటాయి. సీడ్‌ క్రమంగా నశించిపోతుంది. ఓ దశకు చేరిన రొయ్యల్లో ఎదుగుదల ఉండదు. వ్యాధులు పుట్టుకొస్తాయి. నీటి నాణ్యత తగ్గిపోతుంది. ఎఫ్‌సీఆర్‌ పెరిగి చెరువు అడుగు భాగం పాడైపోతుంది. సీడ్‌ నుంచి మేత, మందులు, యాంటీబయోటిక్స్‌ ఇలా అన్నింటినీ ముందుగా పరీక్షించుకోవడం మంచిది. ఈ పరిస్థితుల్లో పెరిగిన రొయ్యలు, చేపలు తినడం వల్ల మనుషుల ఆరోగ్యంపైనా దుష్ప్రభావం పడుతుంది’ అని కైకలూరు మత్స్యశాఖ ఏడీఆర్‌ ప్రతిభ తెలిపారు.


తనిఖీలు నిర్వహిస్తున్నాం

‘ఇటీవల కాలంలో ఆక్వాకు సంబంధించిన నిషేధిత ఔషధాల సరఫరాపై తరచుగా ఫిర్యాదులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అనేకచోట్ల తనిఖీ నిర్వహించి అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుంటున్నాం. తయారీ, విక్రయదారులపై కేసులు నమోదు చేస్తున్నాం. రైతులు నకిలీ మందులు, మేతలు, నిషేధిత యాంటీబయోటిక్స్‌ వంటివి గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి’ అని భీమవరం ఔషధ నియంత్రణ శాఖ అధికారి పి.మల్లికార్జునరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని