కన్నడ మద్యం.. తెలుగింట వ్యాపారం

జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లోని ఆంధ్ర- కర్ణాటక సరిహద్దుల్లో ఇబ్బడిముబ్బడిగా కర్ణాటక మద్యం దుకాణాలు ఏర్పాటు కావడం అక్రమ మద్యం వ్యాపారులకు వరంలా మారింది.

Updated : 26 May 2023 03:12 IST

సరిహద్దు దుకాణాల నుంచి యథేచ్ఛగా తరలింపు

శాంతిపురం మండలంలోని 64పెద్దూరు- ముద్దనపల్లె రోడ్డులో ఈనెల 3న తనిఖీలు చేపట్టిన రాళ్లబూదుగూరు పోలీసులు.. రూ.5.20 లక్షల విలువైన కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. గుడుపల్లె మండలం సరిహద్దున బిసానత్తంలోని కర్ణాటక దుకాణం నుంచి మద్యాన్ని కుప్పం మండలానికి చెందిన వ్యక్తి తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఇతని ఇంట్లో పెద్దఎత్తున కన్నడ మద్యం పట్టుబడింది. కుప్పం మండలంలోని గ్రామాల్లో గొలుసు దుకాణాలకు సరఫరా కోసం మద్యంను నిల్వ చేసుకున్నట్లు విచారణలో వెలుగు చూసింది.


శాంతిపురంలో దాదాపు పది చోట్ల కర్ణాటక మద్యం విక్రయాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. గుండిశెట్టిపల్లె వద్ద కర్ణాటక పరిధిలోని నాలుగు మద్యం దుకాణాల నుంచి ద్విచక్రవాహనాల్లో మద్యం సీసాలు, ప్యాకెట్లను తెచ్చి మండల కేంద్రంలోని కొన్ని హోటళ్లు, ఇళ్లలో విక్రయాలు నిత్యకృత్యంగా సాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా.. జిల్లాలోని పశ్చిమ మండలాలల్లో కర్ణాటక మద్యం అక్రమాలు జోరందుకున్నట్లు ఆరోపణలున్నాయి.


కుప్పం, న్యూస్‌టుడే: జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లోని ఆంధ్ర- కర్ణాటక సరిహద్దుల్లో ఇబ్బడిముబ్బడిగా కర్ణాటక మద్యం దుకాణాలు ఏర్పాటు కావడం అక్రమ మద్యం వ్యాపారులకు వరంలా మారింది. సరిహద్దు మండలాలు, గ్రామాలకు కూత వేటు దూరంలోని దుకాణాలకు కర్ణాటక మద్యం తరలింపు సులభంగా మారింది. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రతి మండలంలోనూ పదుల సంఖ్యలో రహదారులు ఉండటంతో అక్రమ మద్యం తరలింపు దారులకు అడ్డూఅదుపూ లేకపోతోంది.
ః తనిఖీలు నామమాత్రమే: కర్ణాటక మద్యం దుకాణాల నుంచి అర్ధరాత్రి వేళల్లో ఆటోలు, ద్విచక్రవాహనాల ద్వారా మద్యంను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తరలింపు, విక్రయాలపై సంబంధిత శాఖల నిఘా నామమాత్రం కావడం.. తనిఖీలూ తూతూ మంత్రం కావడంతో అక్రమార్కులు పెట్రేగిపోతున్నారు. కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం మండలాల సరిహద్దున దాదాపు 15కు పైబడి కర్ణాటక మద్యం దుకాణాలుండగా.. వాటిలో విక్రయాలకు సంబంధించి సుమారు 30 శాతం మద్యం గ్రామాలకు చేరుతున్నట్లు తెలుస్తోంది. గుండిశెట్లిపల్లె, రాజుపేటరోడ్డు, శిద్ధావూరు, కెంపాపురం, బిసానత్తం తదితర చోట్ల కన్నడ మద్యం దుకాణాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పోలీస్‌శాఖ తరఫున అడపాదడపా తనిఖీలు చేపడుతూ.. కేసులు నమోదు చేస్తున్నారు. ఎస్‌ఈబీ తరఫున నిఘా తనిఖీలు కొరవడ్డాయని విమర్శలున్నాయి.
ః ఊరూవాడా గొలుసు దుకాణాలు: కన్నడ మద్యం ఇంటి వద్దకే చేరుతుండటంతో గ్రామాల్లో విచ్చలవిడిగా గొలుసు దుకాణాలు కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రాజకీయ పరపతి కలిగిన వారు సైతం మద్యం బెల్టుషాపులను ఆదాయ వనరుగా మలుచుకుంటున్నారు. జనావాసాల్లో ఎక్కడ చూసినా.. కన్నడ మద్యం ఖాళీ సీసాలు, టెట్రా పాకెట్లు కుప్పలుగా పడి ఉంటున్నాయి. అధికారులు తనిఖీలు విస్తృతం చేసి అక్రమాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని