పరిశ్రమలకు ఆర్థిక దన్నేది..!

ప్రభుత్వం ఏళ్లుగా చెల్లించాల్సిన బకాయిలు ఇకనైనా విడుదల చేస్తుందా...లేదా అని పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తున్నారు.

Updated : 28 May 2023 05:22 IST

రాయితీలు.. ప్రోత్సాహకాలకు ఎదురుచూపులు

ఎదురుచూపులుఈనాడు-విశాఖపట్నం: ప్రభుత్వం ఏళ్లుగా చెల్లించాల్సిన బకాయిలు ఇకనైనా విడుదల చేస్తుందా...లేదా అని పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు(జీఐఎస్‌) నిర్వహణకు ముందు ఎంఎస్‌ఎంఈలు, ఐటీ పరిశ్రమలకు సంబంధించి ప్రోత్సాహకాలు, రాయితీలు విడుదల చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఆ తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డొచ్చిందని, కోడ్‌ ముగియగానే నిధులు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పుకొచ్చారు. ఆపై నిధుల సర్దుబాటుతో జాప్యం అంటూ నెట్టుకొచ్చారు. తాజాగా రెవెన్యూలోటు తీర్చేందుకు ఏకంగా రూ.10 వేల కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇప్పుడైనా పరిశ్రమలు, ఐటీని ఆదుకునేందుకు ముందుకు వస్తారా? సచివాలయాలు, హెల్త్‌క్లినిక్‌లు, నాడు-నేడు పనుల పెండింగ్‌ బిల్లులు విడుదల చేస్తారా? అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.

ఇంకెప్పుడు...: విశాఖలో ఐటీ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామంటూ ఊదరగొట్టిన వైకాపా పాలకులు.. క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వడం లేదనే విమర్శలొస్తున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐటీ రంగానికి ప్రోత్సాహకాలు, రాయితీలు అందలేదు. ఐటీ కంపెనీలకు  సుమారు రూ.75-80 కోట్ల వరకు రాయితీలు ఇవ్వాల్సి ఉంది. ఏడాదిపాటు ఒకరికి ఉద్యోగం కల్పిస్తే రూ.లక్ష చొప్పున ఇచ్చే ప్రోత్సాహకాలు నిలిచిపోయాయి. ఆర్థిక సమస్యలతో పలు కంపెనీలు మూత పడుతున్నాయి. డీటీపీ (డిజిగ్నెటేడ్‌ టెక్నాలజీ పార్కు) పాలసీలో భాగంగా విశాఖ ఐటీ పార్కులో ఏ కంపెనీ దరఖాస్తు చేసుకున్నా... సగం అద్దెకే స్థలం ఇవ్వడంతోపాటు, ఇంటర్నెట్‌, నిరంతర విద్యుత్తు సౌకర్యం గత ప్రభుత్వం కల్పించింది. అప్పటి అద్దె బకాయిలు సైతం ప్రస్తుత ప్రభుత్వం చెల్లించకుండా చేతులెత్తేసింది. కొవిడ్‌ సమయంలో కంపెనీలకు విద్యుత్తు ఎండీ, ప్రాపర్టీ ఛార్జీలు రద్దు చేస్తామని స్వయానా ముఖ్యమంత్రి ప్రకటించి ఇంత వరకు అమలు చేయలేదు.

ప్రతిపాదనలు పంపుతున్నా..: జిల్లాల విభజన తర్వాత విశాఖ పరిధిలో 350-400 ఎంఎస్‌ఎంఈలున్నాయి. ఐడీపీ పాలసీలో ఉన్న కొన్ని పరిశ్రమలకు సంబంధించి 120 వినతులకు సుమారు రూ.20 కోట్ల వరకు చెల్లించాలి. ఇలాగే ఐదు సంవత్సరాల రాయితీలివ్వాల్సిన పరిశ్రమలకు బకాయిలున్నాయి. గతంలో పెండింగ్‌ ఉన్నవి, ప్రస్తుత ప్రభుత్వంలో పెండింగ్‌ ఉన్న రాయితీలు సుమారు రూ.50 కోట్లపైగా ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అనేక సార్లు ప్రతిపాదనలు పంపుతున్నా నగదు జమ కాలేదు. నాలుగేళ్లలో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు వంద వరకు మూతపడ్డాయి.

జులైలో విడుదల చేస్తాం: మంత్రి: ‘రాష్ట్రవ్యాప్తంగా ఐటీ, ఎంస్‌ఎంఈలకు సంబంధించి రూ.600-700 కోట్ల మధ్య ప్రోత్సాహకాలు, రాయితీలకు సంబంధించి బకాయిలున్నాయి. ఇటీవల వైకాపా సంక్షేమ క్యాలెండర్‌ విడుదల చేశాం. దీనిలో భాగంగానే జులై నెలలో ఐటీ, ఎంఎస్‌ఎంఈలకు రాయితీలు విడుదల చేసేందుకు నిర్ణయించాం’ అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని