సామగ్రే ఇవ్వడం లేదు.. ఇళ్లెలా కట్టుకునేది!

‘సిమెంట్‌ ఇస్తే ఇనుము లేదంటున్నారు. ఇనుము ఇస్తే సిమెంట్‌ ఇవ్వడం లేదు. అయినా అప్పోసప్పో చేసి శ్లాబు దశకు కట్టుకున్నాం.

Updated : 03 Jun 2023 05:16 IST

కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌కు సమస్యలు వివరిస్తున్న పక్కా గృహాల లబ్దిదారులు

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: ‘సిమెంట్‌ ఇస్తే ఇనుము లేదంటున్నారు. ఇనుము ఇస్తే సిమెంట్‌ ఇవ్వడం లేదు. అయినా అప్పోసప్పో చేసి శ్లాబు దశకు కట్టుకున్నాం. ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే గృహాలను పూర్తిస్థాయిలో నిర్మించుకుంటాం...’ అని జగనన్న కాలనీ గృహాల లబ్ధిదారులు కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. త్రిపురాంతకం శివారులోని జగనన్న లేఅవుట్‌ను కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ శుక్రవారం పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గృహ నిర్మాణాలకు అవసరమైన ఇనుము, సిమెంట్‌ సకాలంలో సరఫరా చేయడం లేదని చెప్పారు. కూలి పనులు చేస్తే వచ్చే సొమ్ము నిర్మానానికి సరిపోనందున మధ్యలోనే ఇల్లు నిలిచిపోయిందని రాములమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రూ.30 వేలు వడ్డీకి తెచ్చి గృహ నిర్మాణాన్ని చేపట్టినా సిమెంట్‌ అందించకపోవడంతో కట్టుకోలేకపోయామని మేరీ అనే లబ్ధిదారు కలెక్టర్‌కు వివరించారు. స్పందించిన కలెక్టర్‌ సామగ్రి ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడం సరైన పద్ధతి కాదని.. వారంలోగా ఇనుము, సిమెంట్‌ అందించకపోతే సస్పెండ్‌ చేస్తానని గృహ నిర్మాణ శాఖ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా పథకంతో పాటు ఉన్నతి పథకం ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని అందించి సత్వరమే గృహ నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలతో పాటు బ్యాంకుల ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ శౌర్య పటేల్‌, మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సేదు మాధవన్‌, ప్రత్యేకాధికారి చెన్నయ్య, ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, ఎంపీడీవో హనుమంతరావు, ఆర్వీ పిచ్చయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని