Odisha Train Accident : అక్కడి వాతావరణం భీతావహం.. ‘ఈనాడు’తో ఏపీ ప్రయాణికులు

పెద్ద శబ్దం. భారీగా కుదుపులు. చుట్టూ చీకటి. ఏం జరిగిందో తెలియని స్థితి. ఏదో పెద్దప్రమాదమే జరిగిందని భావించాం. దిగి చూస్తే ధ్వంసమైన బోగీలు. ఎటు చూసినా ఆర్తనాదాలు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు కనిపించాయి.

Updated : 03 Jun 2023 08:12 IST

ఈనాడు, అమరావతి: పెద్ద శబ్దం. భారీగా కుదుపులు. చుట్టూ చీకటి. ఏం జరిగిందో తెలియని స్థితి. ఏదో పెద్దప్రమాదమే జరిగిందని భావించాం. దిగి చూస్తే ధ్వంసమైన బోగీలు. ఎటు చూసినా ఆర్తనాదాలు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు కనిపించాయి. అక్కడ అంతా భయానక వాతావరణం నెలకొంది. ఇవీ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ... ఏపీలోని విజయవాడ, ఏలూరు తదితర స్టేషన్లలో దిగాల్సిన పలువురు ప్రయాణికులు.. ప్రమాద స్థలం నుంచి ‘ఈనాడు’తో వెల్లడించిన అభిప్రాయాలు.

చెల్లాచెదురుగా మృతదేహాలు
- సుశాంత్‌, రాజమహేంద్రవరం

బాలేశ్వర్‌ నుంచి రాజమహేంద్రవరం వస్తున్నాం. ఎస్‌-3 స్లీపర్‌ బోగీలో ఉన్నాం. ఇదీ ఘోరమైన ప్రమాదం. మా బోగీ నుంచి బయటకు వచ్చి చూస్తే ముందున్న స్లీపర్‌, జనరల్‌ బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ఎక్కువ సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదురుగా బయట పడివున్నాయి. అక్కడి వాతావరణం చూస్తే భీతావహంగా ఉంది.


30 సెకండ్ల పాటు కుదుపులు
- శ్రీకర్‌బాబు, ఏలూరు

షాలిమార్‌ నుంచి ఏలూరు వస్తున్నాం. మేం బీ8 కోచ్‌లో ఉన్నాం.  30 సెకండ్ల పాటు బోగీలు కుదుపులకు లోనయ్యాయి. మేమంతా తీవ్ర ఆందోళన చెందాం. కిందికి దిగి చూస్తే మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లో అంబులెన్సులు వచ్చాయి. మేం ప్రమాద స్థలం నుంచి కిలోమీటరు దూరం నడుచుకుంటూ వెళ్లి.. అక్కడ నుంచి బస్సులో భువనేశ్వర్‌ వెళ్లాం.


ఏం జరుగుతుందోనని ఆందోళన
- గోపీకృష్ణ, విజయవాడ

షాలిమార్‌ నుంచి విజయవాడ వస్తున్నాం. పెద్ద శబ్దంతో ప్రమాదం జరిగింది. మా కోచ్‌ పడిపోతుందని భావించాం. కొంత ఒరిగి ఆగింది. వెంటనే మేం దిగిపోయాం. ఆందోళనతో ఒకరిని ఒకరు పట్టుకొని కేకలు వేశాం. మా కోచ్‌కు ఎక్కువ ప్రమాదం లేదు. మేం బి-9 కోచ్‌లో ఉన్నాం. మా కోచ్‌లోని టీసీకి గాయాలయ్యాయి. బోగీ నుంచి మేం బయటకు దిగినప్పుడు రైల్వే లైన్‌ విద్యుత్‌ తీగలు మాకు తగిలేలా వేలాడుతున్నాయి. అదృష్టం కొద్దీ వాటిలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాం.


జనరల్‌ బోగీ, స్లీపర్‌ కోచ్‌లు ధ్వంసం
- యు.రామారావు, విజయవాడ

మేం షాలిమార్‌ నుంచి విజయవాడకు వస్తున్నాం. థర్డ్‌ ఏసీ బోగీలో ఉన్నాం. బోగీలన్నీ పట్టాలు తప్పాయి. జనరల్‌ బోగీలు, స్లీపర్‌ కోచ్‌లు ఎక్కువగా ధ్వంసం అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని