ధాన్యం డబ్బులకు నిరీక్షణ

జిల్లాలో రైతులు ధాన్యం విక్రయించి, డబ్బుల కోసం నిరీక్షిస్తున్నారు. యాసంగిలో ఈసారి గతంలో కంటే 1.50 లక్షల ఎకరాల్లో అధికంగా వరి సాగు చేశారు.  సుమారు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.

Updated : 05 Jun 2023 06:33 IST

పెద్దమందడి: దొడగుంటపల్లి కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం

న్యూస్‌టుడే, వనపర్తి: జిల్లాలో రైతులు ధాన్యం విక్రయించి, డబ్బుల కోసం నిరీక్షిస్తున్నారు. యాసంగిలో ఈసారి గతంలో కంటే 1.50 లక్షల ఎకరాల్లో అధికంగా వరి సాగు చేశారు.  సుమారు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అందులో నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకొంది. అందుకు అనుగుణంగా జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించింది. అయితే అకాల వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గిపోయి కేవలం 3.50 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే దిగుబడి వచ్చినట్లు వ్యవసాయ శాఖాధికారులు పేర్కొంటున్నారు. అందులో రైతులు సుమారు లక్ష మె.ట. వరకు విత్తనాలు, సొంత అవసరాలు నిల్వ చేయగా.. 2.50 లక్షల మె.ట. విక్రయానికి తెస్తారని అంచనా వేశారు.

2 లక్షల మె.టన్నుల కొనుగోలు..

ఈసారి యాసంగిలో వరి సాగు పెరిగింది. తీరా గింజలు పట్టేసమయంలో  మెడవిరుపు తెగులు సోకి ధాన్యం తాలు పోయాయి. దాంతో ఎకరానికి 32 క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడి 26 క్వింటాళ్లకు పడిపోయింది. కొనుగోలు లక్ష్యంలో కూడా కోత పడింది. ఆత్మకూరు, అమరచింత మండలాల్లో 30 వేల మె. టన్నుల ధాన్యం ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు.  

మూడు మండలాల్లో ఇంకా కోతలు..

జిల్లాలో జూరాల ప్రాజెక్టు కింద చివరి ఆయకట్టు మండలాల్లో మినహా అన్ని చోట్లా ధాన్యం కొనుగోలు కేంద్రాలు 90 శాతం మూతపడ్డాయి. జూన్‌ 3వ తేదీకంతా కొనుగోళ్లు పూర్తి చేయాలని భావించినా.. తూకాల్లో జాప్యంతో కొంత ఆలస్యం అయింది. జిల్లాలో యాసంగి వరి ధాన్యం సేకరణకు 259 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నా.. కొన్నిచోట్ల ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. జూరాల ఎడమ కాల్వ కింద చివరి ఆయకట్టు ఉన్న పెబ్బేరు, చిన్నంబావి, శ్రీరంగాపూర్‌ మండలాల్లో ఇంకా వరి కోతలు జరుగుతున్నాయి. ఆ ధాన్యం మార్కెటులోకి వస్తే లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు కొనుగోళ్లలో వేగం పెంచారు.

తరుగు, బిల్లుల జాప్యం సమస్య..

ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సి ఉండగా ఒక్కో రైతుకు నెల రోజులు దాటినా బిల్లులు రావడం లేదు. దీనికి తోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కొన్నా, రైసుమిల్లర్లు తరుగు పేరుతో క్వింటాలు మీద అయిదు కిలోల వరకు కోత పెట్టి లెక్కిస్తున్నారు.

రూ.224కోట్ల చెల్లింపులు

కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి రైతులకు బిల్లులు ఎప్పటికప్పుడు వేస్తూనే ఉన్నాం. కమిషనరేట్‌ నుంచి నిధులు వచ్చినవి వచ్చినట్లుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం. శనివారం రూ.44 కోట్లు వచ్చాయి. వాటిని రైతుల ఖాతాల్లోకి మళ్లించాం. ఇప్పటి వరకు జిల్లాలో 32 వేల మంది రైతులకు రూ.345కోట్లు డబ్బులు చెల్లించాల్సి ఉండగా రూ.224 కోట్లు చెల్లించాం. మిగతావి కూడా త్వరలోనే వస్తాయి.

కొండలరావు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజరు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు