గిరిజన విద్యపై పట్టింపేది?

గిరిజన విద్యార్థులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. 2023-24 విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభం కానున్నా.. ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదు.

Updated : 05 Jun 2023 06:32 IST

ఏటూరునాగారంలోని బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: గిరిజన విద్యార్థులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. 2023-24 విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభం కానున్నా.. ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదు. అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టక కునారిల్లుతోంది. అక్షరాస్యత శాతం ఏజెన్సీ ప్రాంతంలోనే తక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రత్యేక విభాగంగా పరిగణించి విద్యాభివృద్ధికి పాటుపడాల్సి ఉంటుంది. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ పర్యవేక్షణలోనే విద్యా వ్యవస్థ ఉన్నప్పటికీ.. అంతా అస్తవ్యస్తంగా మారింది. పదేళ్లుగా స్కూల్‌ అసిస్టెంట్లకు పీజీ హెచ్‌ఎంలుగా, ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పించడం లేదు. ఖాళీగా ఉన్న పీజీహెచ్‌ఎం పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. ఏ మాత్రం అనుభవం లేని ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులుగా నియమించడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది.

నిబంధనలపై అవగాహన లేమి

2023 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ప్రకటించింది. ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీసు రూల్స్‌ విషయంలో ఒకరిపై ఒకరు కోర్టులో కేసు వేసుకోవడంతో.. ఆ ప్రక్రియ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ కోర్టు కేసుతో సంబంధం లేని గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రకటన ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. విద్యాశాఖ పరమైన నిబంధనలపై సమగ్ర అవగాహన లేని అధికారులు ఉన్నతస్థాయిలో ఉండటం మూలంగానే ఈ పరిస్థితి తలెత్తుతోందని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఫలితంగా గిరిజన విద్య కుంటుపడుతుందని వాపోతున్నారు.

డిప్యూటీ డీఈవో   ఐటీడీఏలోనే ఎందుకు?

జోనల్‌ వ్యవస్థ ఏర్పాటు కారణంగా డిప్యూటీ డీఈవో పోస్టును రద్దు చేశారు. రాష్ట్రంలో ఎక్కడాలేని డిప్యూటీ డీఈవో పోస్టు ఐటీడీఏలో మాత్రం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రంగాపూర్‌ ఆశ్రమ ఉన్నత పాఠశాల పీజీహెచ్‌ఎం సారయ్యను సీనియర్‌ పీజీహెచ్‌ఎంగా పరిగణించి ఆయనకు ఇన్‌ఛార్జి డిప్యూటీ డీఈవోగా బాధ్యతలు అప్పగించారు. గ్రేడ్‌-1 పీజీ హెచ్‌ఎం, ఉపాధ్యాయ శిక్షణ కళాశాల అధ్యాపకులు గతంలో ఈ పోస్టులో కొనసాగేవారు. ఐటీడీఏలో కూడా ఇదే విధానం ఉండేది. ప్రస్తుతం ఉన్న డిప్యూటీ డీఈవో బడులను తనిఖీ చేసినట్లుగాని, పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించిన సందర్భాలు లేవని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. అనుభవం లేని ఓ గ్రేడ్‌-2 పీజీ హెచ్‌ఎంకి బాధ్యతలప్పగించడంతో.. రంగాపూర్‌ ఆశ్రమ ఉన్నత పాఠశాల పతనావస్థకు చేరుకుంది. ఒకప్పుడు 500 నుంచి 600 మంది విద్యార్థులుండే ఈ బడి మూసివేసే దారిలో పయనిస్తోంది. అక్కడ పని చేసే ఉపాధ్యాయులందరికీ అక్రమ డిప్యుటేషన్లు ఇస్తూ ఇతర ప్రాంతాల్లోకి పంపించారని పలువురు ఆరోపిస్తున్నారు.

దెబ్బతింటున్న విద్యాప్రమాణాలు  

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం అమలుకు నోచుకోవడం లేదు. ప్రాజెక్ట్‌ వనరుల కేంద్రం నామమాత్రంగా మారింది. పీఎంమ్మార్సీలో నిపుణులను నియమించి బడుల్లో నిరంతర సమగ్ర మూల్యాంకన(సీసీఈ) అమలుపై పర్యవేక్షణ చేపట్టాల్సి ఉంటుంది. సీసీఈ నిబంధనల ప్రకారం విద్యార్థులతో పాఠ్యాంశాల బోధన పూర్తయిన వెంటనే సంబంధిత పాఠ్యాంశంలో ఏ స్థాయిలో సామర్థ్యాలు సాధించాడో మూల్యాంకనం చేయాలి. ఎలాంటి స్టడీ మెటీరియల్‌, గైడ్స్‌ వాడకూడదు. పరీక్షల సమయంలో మెటీరియల్‌ ఇచ్చి విద్యార్థులను సన్నద్ధం చేస్తుండడంతో.. విద్యా ప్రమాణాలు దారుణంగా దెబ్బ తింటున్నాయి. పదో తరగతి పూర్తి చేసినా.. ఆ విద్యార్థి పై తరగతుల్లో రాణించలేకపోతున్నాడు. ఒకప్పుడు సాక్షాత్తూ సరస్వతీ నిలయాల్లా గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థలు విలసిల్లేవి. ప్రస్తుతం విద్యా ప్రమాణాలు పడిపోయి, పర్యవేక్షణలేక అమాయక అడవి బిడ్డల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని