CM Jagan Tour: పెళ్లికి వచ్చినా బలవంతపు తరలింపులేనా?

సీఎం జగన్‌ జిల్లాల పర్యటన సందర్భంగా తమ బలం నిరూపించేందుకు.. డ్వాక్రా మహిళల తరలింపు ఇటీవల సర్వసాధారణమైంది.

Updated : 08 Jun 2023 08:15 IST

రాజోలు ఎమ్మెల్యే కుమారుడిని  ఆశీర్వదించేందుకు వచ్చిన సీఎం
రోడ్‌షోకు బస్సుల్లో డ్వాక్రా, అంగన్వాడీ సిబ్బంది తరలింపు

సీఎం జగన్‌ మధ్యాహ్నం మలికిపురం వస్తున్నారు.. మన గ్రామసంఘంలోని సభ్యులంతా వెళ్లి సీఎంకు థ్యాంక్స్‌ చెప్పి వద్దాం. ఈ గ్రూపులోని ముసలోళ్లు, గర్భిణులు తప్ప అందరూ రావాలి. ఎవరు రోగులో నాకు తెలుసు. మన సంఘం నుంచి 200 మందిని తీసుకురమ్మని చెప్పారు. అంతకుమించి తెస్తామని చెప్పాం. ఏమైనా సందేహాలుంటే ఫోన్‌ చేయండి’

రాజోలు నియోజకవర్గంలో ఓ గ్రామసంఘ సభ్యులకు అధ్యక్షురాలు పంపిన సందేశం


ఈనాడు-రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే-పి.గన్నవరం, మలికిపురం: సీఎం జగన్‌ జిల్లాల పర్యటన సందర్భంగా తమ బలం నిరూపించేందుకు.. డ్వాక్రా మహిళల తరలింపు ఇటీవల సర్వసాధారణమైంది. జనసేన తరఫున గెలిచిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడు వెంకటరామ్‌ పెళ్లికి సీఎం జగన్‌ను ఆహ్వానించడంతో ఆయన బుధవారం మధ్యాహ్నం మలికిపురం వచ్చారు. హెలికాప్టర్‌ దిగిన తర్వాత సుమారు 1.5 కిమీ మేర రోడ్డుమార్గంలో కత్తిమండలోని వేదిక వద్దకు రావాలి. ఈ మార్గం పొడవునా డ్వాక్రా మహిళలను, అంగన్‌వాడీ సిబ్బందిని బలవంతంగా తీసుకువచ్చి వారి చేతికి ‘థాంక్యూ సీఎం సార్‌’.. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ తదితర ప్లకార్డులు ఇచ్చి స్వాగతం పలకాలని అధికారులు హుకుం జారీచేశారు. ఎండలో వచ్చిన వారంతా... ఎమ్మెల్యే ఇంట వేడుకైతే తమకెందుకు ఈ తిప్పలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహవేదిక నుంచి తిరిగి హెలిప్యాడ్‌ వద్దకు సీఎం వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే అంతా తిరుగుముఖం పట్టారు.

* సీఎం వస్తున్నారని ఉదయం నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సుమారు 1.50 కి.మీ మేర రోడ్డుకు ఇరువైపులా ఇనుప బారికేడ్లు ఏర్పాటుచేయడంతో దుకాణాలు మూసేశారు.

* సాయత్రం 3.44కు మలికిపురం చేరుకున్న సీఎం జగన్‌ వేదిక వద్దకు వెళ్లి వధూవరులు తన్మయి, వెంకటరామ్‌ను ఆశీర్వదించారు. అయిదు నిమిషాల తర్వాత హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. 40 నిమిషాల పాటు పలువురు దివ్యాంగులు, అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. 5.40కి తాడేపల్లికి పయనమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని