అక్రమార్కులకు.. అడ్డదారులు

పన్ను ఎగవేతను అరికట్టేందుకు రూపొందించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి తప్పించుకునేందుకు వ్యాపారులు అడ్డదారులు వెతికారు.

Updated : 18 Sep 2023 05:35 IST

చట్టాన్ని అనుకూలంగా మార్చుకుంటున్న వ్యాపారులు
ఏటా రూ.100 కోట్లకుపైగా పన్ను ఎగవేత

30 కిలోల పరిమాణంలో కందిపప్పు ప్యాకెట్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : పన్ను ఎగవేతను అరికట్టేందుకు రూపొందించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి తప్పించుకునేందుకు వ్యాపారులు అడ్డదారులు వెతికారు. విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌)తో చిరు వ్యాపారులకు ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో జీఎస్టీలో కేంద్రం పలు మార్పులు తీసుకొచ్చింది. నిత్యావసర సరకులకు జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చింది. కొత్త జీఎస్టీ చట్టంలో ఉన్న వెసులుబాటును వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల ప్యాకెట్‌పై కిలో పరిమాణం పెంచేసి రూ.కోట్ల పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్నారు.  

పరిమాణం మార్చి..

విడి నిత్యావసర సరకులపై కేంద్రం జీఎస్టీ మినహాయింపు ఇచ్చింది. బ్రాండెడ్‌ ప్యాకింగ్‌ సరకులపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గతేడాది జరిగిన జీఎస్టీ సవరణలో 25 కిలోల బియ్యం ప్యాకింగ్‌పైనా పన్ను విధించారు. దీంతో బ్రాండెడ్‌ కంపెనీలన్నీ ప్యాకింగ్‌ విధానాన్ని సవరించుకున్నాయి. ప్యాకింగ్‌ పరిమాణం 26 కిలోల నుంచి 30 కిలోలకు మార్చాయి.

  • ఉమ్మడి జిల్లాలో అనధికారిక అంచనాల ప్రకారం ప్రతి రోజూ వెయ్యి మెట్రిక్‌ టన్నుల బియ్యం విక్రయిస్తారు. కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి వచ్చే సాధారణ బియ్యంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సరకుతోపాటు పంజాబ్‌, హరియాణా నుంచి వచ్చే బాస్మతి బియ్యం కూడా ఉంటున్నాయి. ఈ లెక్కన బయట ఇతర ప్రాంతాలతోపాటు ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన 550 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని వ్యాపారులు విక్రయిస్తున్నారు.  

ఖజానాకు చిల్లు..

బియ్యం ప్యాకింగ్‌ 26 నుంచి 30 కిలోల ప్యాకింగ్‌లోకి మారిపోయాయి. జీఎస్టీ నిబంధనల ప్రకారం బియ్యంపై 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ గణాంకాల ప్రకారం బియ్యం ధర కిలోకు కనీస ధర రూ.50 ఉండగా... రూ.2.50 వరకు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో వినియోగమయ్యే బియ్యంపై రోజుకు కనీసం రూ.15 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ చట్టాన్ని వ్యాపారులు అనుకూలంగా మార్చుకుని నెలకు రూ.4.50 కోట్ల మేర ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించకుండా జేబు నింపుకొంటున్నారు.

అధికారులకు తెలిసినా..

ప్యాకెట్‌పై ఒక కిలో పరిమాణం పెంచి రూ.కోట్ల పన్ను ఎగ్గొడుతున్నా అధికారులు చేసేదేమీలేక చూస్తూ ఉండిపోతున్నారు. చట్టంలోని వెసులుబాట్లను వ్యాపారులు అనుకూలంగా మలుచుకోవడంతో ఇలాంటి సమస్య ఎదురవుతోందని, జీఎస్టీ చట్ట సవరణ  జరిగితే చర్యలు తీసుకోవడం సాధ్యపడుతుందని అధికారులు చెబుతున్నారు.

ధరలు పెంచుకుంటూ..

వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని కొందరు వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. అలా అని  వినియోగదారులకు తక్కువ ధరకే అమ్ముతున్నారా అంటే.. అదీ లేదు. బియ్యం, కందిపప్పు ధరలు అమాంతం పెంచుకుంటూ పోతున్నారు. ఈ రెండింటితోపాటు బాస్మతి బియ్యంతో కలిపి నెలకు రూ.10 కోట్ల మేర పన్ను ఎగ్గొడుతున్నారు. ఈ లెక్కన ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏటా రూ.120 కోట్ల పన్నును ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం లేదు.

  • అన్‌ బ్రాండెడ్‌ ప్యాకింగ్‌తో రూ.కోట్ల మేర బియ్యం, కందిపప్పు, ఇతర నిత్యావసరాల విక్రయాలు జరుగుతున్నాయి. అయినా తూనికలు, కొలతలు, ఇటు పౌరసరఫరాలు, చివరికి జీఎస్టీ అధికారులు.. ఇలా ఏ  ఒక్కరూ పట్టించుకోవడం లేదు.

కందిపప్పుదీ అదే దారి

బియ్యం ఒక్కటే కాదు.. కందిపప్పుదీ అదే దారి. కందిపప్పును జీఎస్టీ నుంచి తప్పించేందుకు వ్యాపారులు 30 కిలోల ప్యాకింగ్‌ చేసి అమ్ముతున్నారు. ఉమ్మడి జిల్లాలో నెలకు 6,500 టన్నుల మేర కందిపప్పు విక్రయాలు జరుగుతున్నాయి. సాధారణ ధర కిలో రూ.160 ఉండగా.. రోజుకు రూ.16 లక్షల చొప్పున నెలకు రూ.4.80 కోట్ల మేర జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగవేస్తున్నారు. బాస్మతి బియ్యంపైనా ప్రతి నెలా రూ.70 లక్షల మేర పన్ను చెల్లించడం లేదు. బియ్యం, కందిపప్పు, బాస్మతి బియ్యంతో కలిపి నెలకు మొత్తం రూ.10 కోట్ల మేర వ్యాపారులు లబ్ధి పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పన్ను కట్టకుండా తప్పించుకుంటున్నారు : శివ, జీఎస్టీ ఆడిటర్‌

ప్రభుత్వ చట్టాలు వినియోగదారులకు ఉపయోగపడేలా ఉంటే బాగుంటుంది. ప్రస్తుతం వచ్చిన కొత్త జీఎస్టీ చట్టాన్ని వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందుతున్నారు. 5 శాతం జీఎస్టీ చెల్లించకుండా ప్యాకెట్‌ పరిమాణాన్ని పెంచేసి పన్ను కట్టకుండా తప్పించుకుంటున్నారు. ప్రభుత్వ ఖాతాలో జమ కావాల్సిన పన్ను.. వ్యాపారుల ఖాతాల్లో జమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని