పరిహారం లేదు.. చర్యలు లేవు!

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లో రైతుల ఇక్కట్లు తొలగడంలేదు. పలు ఫార్మా పరిశ్రమలు నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించినా చర్యలు తీసుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 21 Sep 2023 05:50 IST

పరిశ్రమల నుంచి యథేచ్ఛగా రసాయనాల విడుదల
ఆందోళనలో పోలేపల్లి సెజ్‌ బాధితులు

తూము ద్వారా బయటకు వదులుతున్న రసాయనాలు, కాలుష్యంతో ఎండిపోయిన చెట్టు

ఈనాడు, మహబూబ్‌నగర్‌ - న్యూస్‌టుడే, జడ్చర్ల గ్రామీణం: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లో రైతుల ఇక్కట్లు తొలగడంలేదు. పలు ఫార్మా పరిశ్రమలు నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించినా చర్యలు తీసుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలతో గతంలో ఈ పారిశ్రామికవాడలో వివిధ శాఖల అధికారులు పర్యటించారు. భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, రైతులు, స్థానికులు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తొమ్మిది పరిశ్రమలకు జరిమానా విధించింది. ఎనిమిది పరిశ్రమలు రూ.18.25 లక్షలు చొప్పున, ఒక పరిశ్రమ రూ.9 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కాలుష్య నియంత్రణ మండలి వద్ద ఈ నగదును డిపాజిట్‌ చేశారు. ఈ నగదును బాధితులకు పరిహారంగా ఇవ్వాలని  కోరగా  అధికారులు ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు పరిహారాన్ని చెల్లించలేదు. రైతులకు ఆ నగదు ఇస్తే తాము తప్పు చేశామని ఒప్పుకున్నట్లవుతుందని, భవిష్యత్తులోనూ ఇబ్బందులుంటాయని పరిహారం రాకుండా నిర్వాహకులు అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మళ్లీ యథావిధిగా రసాయనాలను వదిలేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

స్పందన కరవు

హరిత ట్రైబ్యునల్‌ గతంలో పలు ఫార్మా పరిశ్రమలపై కొరఢా ఝుళిపించినా ఎలాంటి మార్పు రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరిహారం కట్టి యథావిధిగా మళ్లీ కాలుష్యాన్ని వదులుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు పరిశ్రమలు ప్రత్యేక కాలువలు, పైపులైన్ల ద్వారా రసాయనాలను చెరువులు, కుంటల్లోకి వదులుతుండటంతో  వందల ఎకరాల్లో భూములు బీళ్లుగా మారే పరిస్థితి. చెరువుల్లో చేపలు మృత్యువాత పడుతుండగా స్థానికులు చర్మసంబంధిత  వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవల రాష్ట్ర కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు మరోసారి ఈ ప్రాంతంలో పర్యటించి నమూనాలను సేకరించారు. అధికారులు వస్తున్న విషయాన్ని ముందుగానే చెప్పడంతో యజమానులు రసాయనాలను వదలడం ఆపేశారు. కాలువల వద్ద కాలుష్యపు ఆనవాళ్లు లేకుండా చేశారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఎలాంటి రసాయనాలు కలవడం లేదని తేల్చడంపై పరిసర గ్రామస్థులు మండిపడుతున్నారు. దీనిపై మహబూబ్‌నగర్‌ ఆర్డీవో అనిల్‌కుమార్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ గతంలో కలెక్టర్‌ సమావేశం పెట్టిన మాట వాస్తవమే అన్నారు. ఆయన బదిలీ కావడంతో మళ్లీ త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి పరిహారం, కాలుష్య నియంత్రణపై సమీక్ష చేపడతామన్నారు.


సాగును వదులుకున్నాను: తనకున్న ఎకరా పొలంలో ఏటా వరి సాగు చేస్తాను. మూడేళ్లుగా పంట వేస్తే ఎదగడం లేదు. రసాయనాలను భూమిలోకి, చెరువుల్లోకి వదులుతుండటంతో పంట సాగుపై ప్రభావం పడుతోంది. పంట మొత్తం ఎండి పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. అందుకే ఈ ఏడాది సాగును వదులుకున్నాను.

శ్రీనివాస్‌ గౌడ్‌, రైతు


మత్స్యకార కుటుంబాలపై ప్రభావం: గతేడాది ముదిరెడ్డిపల్లి చెరువులపై 40వేల చేపపిల్లలను వదిలారు. పోలేపల్లి సెజ్‌లోని పలు పార్మా పరిశ్రమలు ఈ చెరువులోకి రసాయనాలు వదులుతుండటంతో నీళ్లు కలుషితమవుతున్నాయి. గతేడాది కాలుష్యం బారిన పడి వందల సంఖ్యలో చేపలు మృతి చెందాయి. ఈ ఏడాది కూడా చేప పిల్లల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆ ప్రభావం మత్స్యకార కుటుంబాలపై పడుతోంది.

ఆంజనేయులు, మత్య్సకార సొసైటీ సంఘం నేత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని