ప్రధాని వచ్చినా.. పాలమూరు రాత మారలే

ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినా పాలమూరు రాత మారలేదని, ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు.

Updated : 03 Oct 2023 06:36 IST

సత్యాగ్రహ దీక్షలకు మద్దతు తెలిపిన ఆచార్య కోదండరాం

దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతున్న టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరా]ం, చిత్రంలో ఆచార్య హరగోపాల్‌ తదితరులు

పాలమూరు, న్యూస్‌టుడే : ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినా పాలమూరు రాత మారలేదని, ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం మహబూబ్‌నగర్‌లోని టీటీడీ కల్యాణ మండపం సమీపంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నేతలు 30 గంటల సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. కోదండరాం హాజరై తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు ప్రధాని వస్తే ఏదైనా ప్రత్యేక పథకం ప్రకటిస్తారని, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పిస్తారని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై స్పష్టత ఇస్తారని అందరూ ఆశించినట్లు చెప్పారు. ఒక్క వరాన్ని కూడా ఇవ్వకుండా అందరినీ నిరాశపరిచారని పేర్కొన్నారు. పాలకులు మైనింగ్‌, ఇసుక, రియల్‌ ఎస్టేట్‌పైనే దృష్టిసారించారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ద్వారా ప్రజలు కాకుండా ఒక కుటుంబం మాత్రమే లాభపడిందన్నారు. ఆ కుటుంబం కన్నంతా ఆదాయంపైనే ఉందని, ప్రతి దాంట్లో వాటా కావాలని చూస్తోందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియమాకాలు సాధించుకునేందుకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించామని, ఇప్పుడు అస్తిత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడాలన్నారు.

మరో ఉద్యమానికి సిద్ధం కావాలి : హరగోపాల్‌  

పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ఆచార్య హరగోపాల్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఆశయాలు నెరవేరలేదన్నారు. నాటి సమస్యలే మరింత పెద్దగా మారాయన్నారు. సాగరహారం, సకల జనుల సమ్మె, వంటవార్పు, ధూంధాం తదితరాలతో ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రజలు, ఉద్యోగులు, అన్ని సంఘాల వాళ్లు తీవ్రంగా శ్రమించారని గుర్తుచేశారు. ప్రస్తుతం మేధావులు, ప్రశ్నించేవారు ఏదైనా కార్యక్రమానికి తలపెడితే పోలీసులు అనుమతించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. నాడు ఉద్యమాన్ని వ్యతిరేకించిన నాయకులే ఇప్పుడు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు పాలిస్తున్నారని, వారికి రాజ్యాంగంపై గౌరవం లేదని మండిపడ్డారు. మరో ఉద్యమానికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. దీక్షల్లో పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ ఎం.రాఘవాచారి, నాయకులు తిమ్మప్ప, వనమాల, రవి, కేసీ వెంకటేశ్వర్లు, వెంకట్‌గౌడ్‌, నారాయణ, కర్ణకోట రవీంద్రానాద్‌, నర్సింహులు, ఇక్బాల్‌ పాషా, రాజేంద్రబాబు, స్వామి, ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.         
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు