
అమ్మాయిల బైక్ స్టంట్.. రూ.28వేల ఫైన్!
లఖ్నవూ: సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల మదిని కొల్లగొట్టేందుకు పలువురు వినూత్నరీతిలో విన్యాసాలు చేస్తుంటారు. కొన్నిసార్లు అలాంటివి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి. యూపీలోని ఘజియాబాద్లో ఇద్దరు యువతుల విషయంలోనూ అలానే జరిగింది. వైరల్ అవ్వడం కోసం వారు చేసిన బైక్ విన్యాసం.. తీరా పోలీసుల కంటపడడంతో భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే శివంగి దబాస్ గత శనివారం తన స్నేహితురాలు, రెజ్లర్ స్నేహ రఘువన్షితో కలిసి ఓ బైక్ విన్యాసాన్ని చేసింది. ఇందుకు సంబంధించిన వీడియాను ఇన్స్టా వేదికగా పంచుకుంది. ఈ వీడియోలో రెజ్లర్ స్నేహ భుజాలపై శివంగి కూర్చొని ఉండగా ఆమె బైక్ నడుపుతోంది. ఇక్కడి వరకు అంత బాగానే ఉన్నా.. ఆ విన్యాసం వీడియో వైరల్గా మారి ఘజియాబాద్లో ట్రాఫిక్ అధికారుల వరకూ చేరింది. ఇంకేముంది ట్రాఫిక్ నియమనిబంధనల్ని అతిక్రమించారంటూ రెజ్లర్ స్నేహ తల్లి మంజుదేవి ఇంటికి రూ.11 వేలు చలానా పంపించారు. వారికి బైక్ ఇచ్చిన ద్విచక్రవాహన యజమాని సంజయ్ కుమార్కు సైతం రూ.17 వేలు జరిమానా విధించినట్లు ఘజియాబాద్ ట్రాఫిక్ ఎస్పీ రామానంద్ కుశ్వాహ తెలిపారు. సరదా కోసం చేసిన ఈ వీడియో జరిమానా వరకు వెళ్తుందని అసలు ఊహించలేదని శివంగి వాపోయారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.