TSRTC: ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.90తో నగరమంతా తిరగొచ్చు..!

ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్థిక భారం తగ్గించే విధంగా నిర్ణయం తీసుకుంది.

Published : 27 Apr 2023 02:09 IST

హైదరాబాద్‌: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్థిక భారం తగ్గించే విధంగా నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్‌ ధరను రూ.100 నుంచి రూ.90కి తగ్గించింది. ఇదే టికెట్‌ను సీనియర్‌ సిటిజన్లకు రూ.80కే అందించనున్నట్టు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సీనియర్‌ సిటిజన్లు వయసు ధ్రువీకరణ కోసం తమ ఆధార్‌ కార్డును బస్‌ కండక్టర్లకు విధిగా చూపించాల్సి ఉంటుందన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో టి-24 టికెట్‌ కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.

హైదరాబాద్‌లో ఎక్కువగా ప్రయాణించే వారికోసం టి-24 టికెట్‌ను ఆర్టీసీ గత నెలలో అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్‌ కొనుగోలు చేస్తే గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. టి-24 టికెట్‌కు మంచి స్పందన వస్తోందని, ప్రతి రోజు సగటున 25వేల వరకు టికెట్లు అమ్ముడవుతున్నాయని సజ్జనార్‌ వెల్లడించారు. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్‌ అందుబాటులో ఉంటుందన్నారు. 

మహిళలు.. సీనియర్‌ సిటిజన్ల కోసం టి-6

మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం టి-6 టికెట్‌ను ఇటీవల ప్రారంభించినట్టు చెప్పారు. రూ.50కి టికెట్‌ కొనుగోలు చేస్తే ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రయాణించవచ్చని తెలిపారు.  కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్‌-24 టికెట్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రూ.300  చెల్లించి టికెట్‌ కొనుగోలు చేస్తే 24 గంటల పాటు నలుగురు ప్రయాణించవచ్చన్నారు. హైదరాబాద్‌ సిటీ పరిధిలో తీసుకువచ్చిన టి-24, టి-6, ఎఫ్‌-24 టికెట్లు కొనుగోలు చేసి క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని