గిరిజనులతో కలిసి టీకా తీసుకున్న తమిళిసై 

కరోనా సమయంలో టీకానే మనకు ఆయుధం అని గవర్నర్‌ తమిళిసై అన్నారు.

Updated : 12 Jul 2021 13:09 IST

మహేశ్వరం: కరోనా సమయంలో టీకానే మనకు ఆయుధం అని గవర్నర్‌ తమిళిసై అన్నారు. అందరూ టీకా తీసుకొని కొవిడ్‌ నుంచి రక్షణ పొందాలన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కె.సి.తండాలో గిరిజనులతో కలిసి గవర్నర్‌ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ తక్కువగా జరుగుతోందని తెలిసి వచ్చినట్లు తెలిపారు. స్వదేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ తీసుకోగలగడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. సొంత వ్యాక్సిన్‌తో ప్రపంచానికి, విమర్శకులకు ఆదర్శంగా నిలిచామని తెలిపారు. గిరిజన గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌ నియంత్రణలో, వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్‌ కేసీ తండాకు వచ్చి గిరిజనుల్లో వ్యాక్సిన్‌పై అవగాహన తీసుకురావడం అభినందనీయమన్నారు. గిరిజన మహిళల్లో టీకాపై ఉన్న భయాలను పోగొట్టేందుకు ఆమె ఇక్కడికి విచ్చేశారన్నారు. గవర్నర్‌ను స్ఫూర్తిగా తీసుకొని వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని