Andhra news: ఏపీలో కొత్తగా 6 లక్షల ఉద్యోగాలు: అమర్నాథ్‌

ఏపీలో కొత్తగా ప్రారంభించబోతున్న పరిశ్రమల వల్ల 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated : 04 Mar 2023 20:25 IST

విశాఖపట్నం: విశాఖ వేదికగా  రెండు రోజులపాటు జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌)లో 352 ఒప్పందాలు చేసుకున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. సదస్సు ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రానికి రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. తొలుత రూ.5 లక్షల కోట్లు వస్తాయని భావిస్తే  అంతకుమించి.. రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.

‘‘పరిశ్రమల వల్ల 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. సదస్సు వల్ల ఏపీ సహజ వనరులు ప్రపంచానికి తెలిశాయి. సదస్సులో వంద దేశాల ప్రతినిధులు, ఏడు దేశాల రాయబారులు పాల్గొన్నారు’’ అని అమర్నాథ్‌ చెప్పారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే పరిశ్రమలను స్థాపిస్తామని ఆయన అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ధ్యేయంగా విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, వనరులు, పరిస్థితులను దేశ విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం వివరించింది. సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పారిశ్రామిక వేత్తలకు జగన్‌ అభినందనలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని