TS news : నిధులు విడుదల చేయాలంటూ కేంద్రానికి హరీశ్‌రావు లేఖ

కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లను విడుద‌ల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌కు లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను మంత్రి ఈ లేఖ‌లో గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం...

Published : 24 Jan 2022 21:18 IST

హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లను విడుద‌ల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌కు లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను మంత్రి ఈ లేఖ‌లో గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేళ్ల బ‌కాయిలు రూ.900 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉందన్నారు. వీటిని విడుద‌ల చేయడంతోపాటు గ్రాంట్‌ను 2021-22 తర్వాత ఐదేళ్లపాటు పొడిగించాలని హరీశ్‌రావు కోరారు. నీతిఆయోగ్ సూచించిన మేర‌కు రూ.24,205 కోట్లు విడుద‌ల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు ఇవ్వాల‌న్న 14వ ఆర్థిక సంఘం సిఫార‌సుల‌ను కేంద్రం ఎందుకు తిర‌స్కరించిందో ఇప్పటికీ అర్థం కావ‌డం లేదని మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, స్పష్టమైన కారణం లేకుండా ఈ గ్రాంట్లను తిర‌స్కరించారన్నారు. కాబట్టి వీటిని వీలైనంత త్వరగా వాటిని విడుదలయ్యేలా చూడాలని అభ్యర్థించారు.

2019-20తో పోల్చితే 2020-21లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని ఈ మేర‌కు తెలంగాణ‌కు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్  విడుద‌ల చేయాల‌ని 15వ ఆర్థిక సంఘం సూచించిందని గుర్తు చేస్తూ.. ఆర్థిక సంఘం సిఫార్సుల‌ను గతంలో ఎప్పుడూ తిర‌స్కరించిన సందర్భాలు లేవని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాల్లో భాగంగా 2014-15లో తెలంగాణకు రావాల్సిన కేంద్రం వాటాను పొర‌పాటున ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారని, అందువల్ల తెలంగాణ‌కు రావాల్సిన రూ.495.20 కోట్లు సర్దుబాటు చేయాలని లేఖలో కోరారు. దీంతోపాటు పెండింగ్ లో ఉన్న ఐజీఎస్టీ నిధులు రూ.210 లను కూడా విడుదల చేయాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని