home isolation: కొత్త మార్గదర్శకాలు ఇవే!

కరోనా మహమ్మారి భారత్‌ను వణికిస్తోంది. నిత్యం లక్షల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడం

Published : 30 Apr 2021 01:17 IST

న్యూదిల్లీ: కరోనా మహమ్మారి భారత్‌ను వణికిస్తోంది. నిత్యం లక్షల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సెకండ్‌వేవ్‌లో కరోనా విజృంభిస్తుండటంతో పాటు, అత్యధికమంది ఆస్పత్రి పాలవుతున్నారు. మిగిలిన వారు స్వీయ నిర్బంధంలో ఉంటూ వైద్యులు సూచించిన మందులతో కరోనా నుంచి కోలుకుంటున్నారు. మధ్యస్థాయి/లక్షణాలు లేని వారికి సంబంధించి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజాగా వాటిలో స్వల్ప మార్పులు చేసింది.

కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సవరించిన మార్గదర్శకాలు ఇవే!

* మధ్యస్థాయి/అసలు లక్షణాలు లేనివారు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ వాడటానికి వీల్లేదు.

* నోటి ద్వారా ఎలాంటి స్టిరాయిడ్స్‌ తీసుకోకూడదు. ఏడు రోజులు దాటిన తర్వాత కూడా జ్వరం, దగ్గు ఉంటే వైద్యుల సూచనల మేరకే మందులు వాడాలి.

* 60ఏళ్లు దాటి, హైపర్‌ టెన్షన్‌, మధుమేహం, గుండె జబ్బు, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వైద్యులు పూర్తిగా పరీక్షించిన తర్వాతే హోం ఐసోలేషన్‌లో ఉండాలి.

* ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా వెంటనే ఆస్పత్రిలో చేరాలి. అలాంటి వారు కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చికిత్స తీసుకోవాలి.

* కరోనా బారిన పడిన వారు గోరు వెచ్చని నీటిని పుక్కిలించాలి. రోజుకు రెండుసార్లు ఆవిరి పట్టాలి.

* పారాసిటమాల్‌ 650 ఎంజీ రోజుకు నాలుగు సార్లు వేసుకున్నా జ్వరం తగ్గకపోతే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి నాన్‌-స్టిరాయిడ్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్‌ను వైద్యులు సూచించవచ్చు.

* ఐవర్‌మెక్‌టిన్‌(ఖాళీ కడుపుతో వేసుకునేది) మాత్రలను 3 నుంచి 5 రోజులు వాడేందుకు అనుమతి

* ఐదు రోజుల పాటు జ్వరం, దగ్గు ఉంటే ఇన్‌హెలేషనల్‌ బ్యూడెసనైడ్‌(ఇన్‌హేలర్‌ ద్వారా తీసుకునే ఔషధం)ను రోజుకు రెండుసార్లు తీసుకునేలా సూచించవచ్చు.

* రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కేవలం ఆస్పత్రిలో చేరిన వారికి మాత్రమే ఇవ్వాలి.

* కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి, శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం, ఆక్సిజన్‌ స్థాయిలు 94శాతానికి పైన ఉండటం, జ్వరం రాకపోతే వారిని లక్షణాలు లేనివారిగా గుర్తించాలి. వారంతా వైద్యుల సూచన మేరకు మందులు వేసుకుంటూ, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి.

* లక్షణాలు లేని, మధ్య స్థాయి లక్షణాలు కలిగిన వారు హోం ఐసోలేషన్‌లో ప్రత్యేకంగా కేటాయించిన గదిలో ఉంటే మంచిది. వారు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు వాడొచ్చు.

* కుటుంబంలోని ఇతర సభ్యులకు ముఖ్యంగా ఇంట్లో ఉండే వృద్ధులకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి.

* హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు తమ గదిలో గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా చూసుకోవాలి. ఎల్లప్పుడూ మాస్క్‌ ధరించే ఉండాలి.

* కరోనా బాధితుడికి ఆహారం అందించే వ్యక్తులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ఇరువురూ ఎన్‌-95 మాస్క్‌ ధరిస్తే మరింత మంచిది.

* కరోనా బాధితుడు వాడిన మాస్క్‌లను సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంలో శుద్ధి చేసిన తర్వాతే పారేయాలి.

* హెచ్‌ఐవీ పాజిటివ్‌, అవయవ మార్పిడి చేయించుకున్న వారు, క్యాన్సర్‌ థెరపీ తీసుకుంటున్న వారు హోం ఐసోలేషన్‌లో ఉండటానికి అనుమతి లేదు. ఒకవేళ ఉండాల్సిన పరిస్థితి వస్తే, వైద్యుల సూచనలు తప్పక తీసుకోవాలి.

* కరోనా బారిన పడినవారు వీలైనంత ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలి. శరీరం తేమను కోల్పోకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. వారు వినియోగించిన ఏ వస్తువును ఇతరులు వినియోగించకూడదు.

* కరోనా బాధితుడు వాడిన వస్తువులు, ప్రదేశాన్ని హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రం చేయాలి.

* కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత కనీసం 10రోజులు తక్కువ కాకుండా హోం ఐసోలేషన్‌లో ఉండాలి. అది కూడా వరుసగా మూడు రోజులు జ్వరం, దగ్గు ఉండకూడదు.

* హోం ఐసోలేషన్ పూర్తయిన తర్వాత మరోసారి కరోనా పరీక్షలు అవసరం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని