
ధవళేశ్వరం వద్ద తగ్గని వరద ఉద్ధృతి
రాజమహేంద్రవరం: గోదావరి మహోగ్రరూపం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి కాస్త శాంతించినప్పటికీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద ఉన్న ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మాత్రం గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద పెరగడంతో సోమవారం 3గంటలకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి నీటి మట్టం 19 అడుగులకు చేరగా.. ఉదయం 11 గంటల సమయానికి 19.80 అడుగులకు చేరింది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం నుంచి 21.92 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
మరోవైపు రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం పుష్కరఘాట్ వద్ద వరద నీరు 62 అడుగులకు చేరింది. ఘాట్ వద్దనున్న ఆలయాలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. గోదావరి ఉగ్రరూపం తగ్గకపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. మరో రెండు, మూడు రోజులపాటు ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.