Ts High court: ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే

ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదిభట్ల శ్రీకళాపీఠం, భారత యాదవ సమితి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.

Updated : 18 May 2023 22:19 IST

హైదరాబాద్‌: ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదిభట్ల శ్రీకళాపీఠం, భారత యాదవ సమితి వేసిన లంచ్ మోషన్‌పై వేసవి సెలవుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అభినంద్ కుమార్ షావిలి విచారణ జరిపారు. ఎన్టీఆర్ విగ్రహంపై  అభ్యంతరం లేదు కాని.. శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడం వల్ల హిందువులు ముఖ్యంగా యాదవుల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టొద్దని స్టే విధించారు. మంత్రి పువ్వాడ అజయ్‌ సహా నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఖమ్మం లక్కారం చెరువులో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కృష్ణావతార విగ్రహం ఏర్పాటు చేయాలని అభిమానులు నిర్ణయించారు. ఎన్టీఆర్‌ వందో జయంతి సందర్భంగా మే 28న దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ 54 అడుగుల విగ్రహాన్ని రూ.2.3 కోట్లతో నిజామాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. లక్కారం  చెరువు మధ్యలో తీగల వంతెన వద్ద ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. విగ్రహాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విగ్రహం తయారీ పనులు తుదిదశకు చేరినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది.

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని