Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో 600మంది విద్యార్థులకు అస్వస్థత

నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి 600 మందికి  పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు...

Updated : 15 Jul 2022 20:44 IST

బాసర: నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి 600 మందికి  పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమికంగా గుర్తించారు. పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థుల మెస్‌ల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రెండు మెస్‌లకు ఒకే చోట భోజనం తయారు చేస్తారు. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు ఒక్కొక్కరిగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. క్రమంగా పలువురు స్పృహ తప్పి పడిపోయారు. అప్రమత్తమైన అధికారులు క్యాంపస్‌లోనే ప్రాథమిక వైద్యం అందించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో నిర్మల్‌, భైంసా వైద్యులను రప్పించి చికిత్స అందించారు.  స్పృహ తప్పి పడిపోయిన కొందరు విద్యార్థులను నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలి: సబితా ఇంద్రారెడ్డి
బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల అస్వస్థతపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. కలెక్టర్‌, బాసర ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఈ ఘటనపై విచారణ జరిపి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కారణాలు గుర్తించి పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని