Chandrababu: హైదరాబాద్‌ నుంచి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ ప్రారంభం

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లారు.

Updated : 24 Sep 2023 08:34 IST

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లారు. ‘కారులో సంఘీభావ యాత్ర’ పేరుతో  పెద్ద సంఖ్యలో కార్లలో బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఎస్సార్‌ నగర్‌, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల నుంచి ర్యాలీగా వెళ్లారు. రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని పరామర్శించి సంఘీభావం తెలపనున్నారు. 

మరోవైపు ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదని ఏపీ పోలీసులు స్పష్టం చేశారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణాటాటా శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ- ఏపీ సరిహద్దులో గరికపాడు సహా వివిధ ప్రాంతాల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. 

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి సమీపంలో ఏపీ-తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద విజయవాడ వెళ్లే ప్రతి వాహనాన్నీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి జగ్గయ్యపేట సీఐ జానకిరామ్ ఆధ్వర్యంలో అనుమంచిపల్లి కోల్డ్‌ స్టోరేజ్‌, బోర్డర్‌ చెక్‌పోస్టు వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని