Mallareddy: మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు.. రూ.6కోట్ల నగదు స్వాధీనం: ఐటీశాఖ

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు వెల్లడించాయి.

Updated : 23 Nov 2022 19:39 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్టు గుర్తించారు. అదనంగా వసూలు చేసిన మొత్తాలను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి. అనధికారికంగా, లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి కోసం వెచ్చించినట్టు పేర్కొన్నారు. 

ఇప్పటి వరకు చేసిన సోదాల్లో రూ.6కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు, సిబ్బంది  65 బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు. కొన్ని చోట్ల సోదాలు ముగిశాయి. మరికొన్ని చోట్ల రాత్రికి ముగిసే అవకాశముందని, ఇంకొన్ని చోట్ల రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువ కాకుండా తక్కువ చూపినట్టు.. ఆధారాలు సేకరించామని పేర్కొన్నారు. మల్లారెడ్డి వియ్యంకుడు వర్ధమాన కళాశాలలో డైరెక్టర్‌గా ఉండటంతో అక్కడ కూడా సోదాలు చేసినట్టు వెల్లడించారు.

అన్ని లెక్కలు సరిగ్గానే ఉన్నాయి: మల్లారెడ్డి

తమ ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన అన్ని లెక్కలు, ధ్రువపత్రాలు సరిగ్గానే ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ‘‘కళాశాలలు, ఆసుపత్రులు, ఆస్తుల వివరాలను ఐటీ అధికారులకు తెలియజేశాం. అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. వారికి అన్ని విధాలా సహకరిస్తున్నాం. అన్ని అనుమతులతోనే కళాశాలలు, ఆసుపత్రులు నిర్వహిస్తున్నాం. నాకు, నా కుమారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. గురువారం  ఉదయానికల్లా ఐటీ సోదాలు ముగిసే అవకాశముంది ’’ అని మల్లారెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని