JEE main 2023: జేఈఈ మెయిన్‌ సెషన్‌- 2కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

గత వారం రోజులుగా విద్యార్థులు నిరీక్షిస్తున్న జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్ష(JEE main 2023 session 2exam) దరఖాస్తుల ప్రక్రియను ఎన్‌టీఏ ప్రారంభించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి మార్చి 12 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది.

Updated : 15 Feb 2023 18:15 IST

దిల్లీ: ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ (JEE main 2023) సెషన్‌-2కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌కు దాదాపు వారం రోజుల పాటు విద్యార్థుల నిరీక్షణ తర్వాత దరఖాస్తులు చేసుకొనేందుకు ఎన్‌టీఏ(NTA) jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో ప్రత్యేక విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 7 నుంచే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే, ఆలస్యానికి కారణాలను వెల్లడించకుండా వెబ్‌సైట్‌లో లింకు ఉంచినప్పుడే దరఖాస్తు చేసుకోండి అన్నట్టుగా ఎన్‌టీఏ వ్యవహరించడంపై నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో బుధవారం దరఖాస్తులను ఆహ్వానిస్తూ వెబ్‌సైట్‌లో లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త అభ్యర్థులతో పాటు మొదటి సెషన్‌ పరీక్ష రాసిన విద్యార్థులు కూడా రెండో విడత పరీక్షకు దరఖాస్తులు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 6, 8, 10, 11, 12 తేదీల్లో జరగనుండగా.. ఏప్రిల్‌ 13, 15 తేదీలను ఎన్‌టీఏ రిజర్వు చేసింది. దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి (ఫిబ్రవరి 15) నుంచి మొదలై మార్చి 12 రాత్రి 9గంటల వరకు కొనసాగనుంది. పరీక్ష రుసుం చెల్లించేందుకు మార్చి 12న రాత్రి 11.50గంటల వరకు అవకాశం ఉంటుందని ఎన్‌టీఏ ఓ ప్రకటనలో తెలిపింది. 

పరీక్ష నిర్వహించే సిటీ, అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడింగ్‌, ఫలితాల ప్రకటించే తేదీలకు ముందుగానే వెల్లడిస్తామని.. ఆ అప్‌డేట్‌లను తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు చూసుకోవాలని సూచించింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షను రికార్డు స్థాయిలో ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే. ఇటీవల వీటి ఫలితాలు విడుదల కాగా.. 20 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్‌ సాధించినట్ట్టు ఎన్‌టీఏ వెల్లడించింది. అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు చేయొద్దని.. అలా చేస్తే అక్రమ మార్గం అనుసరిస్తున్నట్టుగా పరిగణించాల్సి వస్తుందని ఎన్‌టీఏ హెచ్చరించింది. జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్ష తర్వాత ఆల్‌ ఇండియా ర్యాంకుల్ని ప్రకటిస్తారు. వీరిలో టాప్‌ 2.5లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశం కలుగుతుంది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, ఎన్‌ఐటీలు, తదితర ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని