Ask ktr: పిల్లలపై టీకా ట్రయల్స్ మొదలయ్యాయి!
తెలంగాణలో పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్ ప్రారంభమయ్యాయని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. #Ask ktr కేటీఆర్ పేరుతో ఆదివారం
హైదరాబాద్: తెలంగాణలో పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ ప్రారంభమయ్యాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. #Ask ktr కేటీఆర్ పేరుతో ఆదివారం ట్విటర్ వేదికగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరతపై కేటీఆర్ స్పందిస్తూ.. డిమాండ్కు తగినట్లు సరఫరా లేదని చెప్పారు. రాష్ట్రంలో రోజుకు 10లక్షల మందికి టీకాలు వేసే సామర్థ్యం ఉందని, అయితే, అందుకు తగినట్లు రాష్ట్రానికి టీకాలు సరఫరా కావడం లేదన్నారు. ‘దేశంలో టీకాల కొరతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాలా దేశాలు 2020 మే నుంచి టీకాలకు ఆర్డర్లు ఇచ్చాయి. భారత్ మాత్రం 2021 జనవరిలో టీకాలకు ఆర్డర్ ఇచ్చింది. అమెరికా, కెనడా వంటి దేశాల్లో 50 కోట్ల డోసులు నిల్వ ఉన్నాయి. మిగులు టీకాలు ఉన్న దేశాలతో కేంద్రం సంప్రదింపులు జరపాలి. వీలైనంత త్వరగా రాష్ట్రాలకు టీకాల సరఫరా పెంచాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, తెలంగాణలో టీకాల వృథా తక్కువ’’ అని అన్నారు.
సర్ వ్యాక్సిన్ అసలు ధర సుమారు రూ.400 ఉంది. కానీ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.1400 తీసుకుంటున్నారు?
కేటీఆర్: మంచి ప్రశ్న. వేర్వేరు ధరలకు వేర్వేరు సంస్థలు వ్యాక్సిన్ విక్రయించుకోవచ్చని భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్రం రూ.150కే వ్యాక్సిన్ కొనుగోలు చేస్తుంది. తయారైన వాటిలో 85శాతం తీసుకుంటుంది. మిగిలిన 15 శాతం రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రులు పోటీ పడాలి. రాష్ట్రాలకు కొవిషీల్డ్ రూ.300లకు, కొవాగ్జిన్ రూ.400లకు పొందుతున్నాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులు కొవిషీల్డ్ రూ.600, కొవాగ్జిన్ రూ.1200 ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పోటీ నేపథ్యంలో ప్రైవేటు రంగంతో రాష్ట్రాలు ఏవిధంగా పోటీ పడగలవు.
అతి తక్కువ సమయంలో తెలంగాణను పూర్తి వ్యాక్సినేటెడ్ రాష్ట్రంగా చేసేందుకు మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి?
కేటీఆర్: మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే గ్లోబల్ టెండర్లకు వెళ్లాం. వారి నుంచి సమాధానం రావాల్సి ఉంది.
ప్రభుత్వం ఆస్పత్రుల్లో కొవిషీల్డ్ వ్యాక్సినేషన్ ఎందుకు ఆపేశారు?
కేటీఆర్: ఐసీఎంఆర్ సూచనల ప్రకారం తొలి డోస్ తీసుకున్న 12 వారాల తర్వాత రెండో డోస్ తీసుకోవాలి. ఈ విషయంపై మీకు అవగాహన ఉంటుందని అనుకుంటున్నా.
రాష్ట్రంలో ఫైజర్ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
కేటీఆర్: డీసీజీఐ, భారత ప్రభుత్వాన్ని అడగండి.
ప్రతిదానికీ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించకపోతే మీరే స్వయంగా వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేసి, ప్రజలకు అందిచవచ్చు కదా!
కేటీఆర్: మీకు నచ్చినా, నచ్చకపోయినా వాస్తవాలను చెబుతున్నా. వ్యాక్సిన్లను నిల్వ చేసుకోవాల్సిన సమయంలో అప్రాధాన్యాలు, సరైన సమయంలో వ్యాక్సిన్లను ఆర్డర్ చేయకపోవడం, వ్యాక్సిన్ల ఎగుమతి చేయడం కేంద్రం తప్పిదాలు. ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి అంతర్జాతీయ వ్యాక్సిన్ కంపెనీలను అనుమతించలేదు. అంతేకాకుండా, ఇంకొన్ని వ్యాక్సిన్ తయారీ సంస్థలకు అనుమతులు ఆలస్యం చేశారు. 2020 చివరిలో భారత్లో వ్యాక్సిన్కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఫైజర్ కోరింది. కానీ, డీసీజీఐ జూన్ మొదటి వారంలో ట్రయల్స్ను అనుమతి ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.